మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (10:14 IST)

పార్టీ పరంగా ఏపీ రాజధాని అమరావతే... : జీవీఎల్ నరసింహా రావు

తమ పార్టీ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు. అయితే, ఈ రాజధాని అంశంపై పోరాడుతున్న అమరావతి ప్రాంత రైతులకు హస్తినలో కంటే కోర్టులో పరిష్కారం లభించవచ్చని ఆయన సూచించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ, ఏపీ రాజధానిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ చెప్పిన సమాధానంలో పూర్తి స్పష్టత ఉందని, కానీ, విపక్ష నేతలే దానికి పెడర్థాలు తీస్తూ, రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమేనని పునరుద్ఘాటించారు. 
 
ఏపీ రాజధానిపై కేంద్రం వైఖరి మారబోదని స్పష్టంచేశారు. అయితే, పార్టీపరంగా ఏపీ రాజధాని అమరావతేనని తాము రాజకీయ తీర్మానం చేశామని చెప్పారు. అమరావతి నుంచి రాజధానిని తీసేయాలని తమకేమీ కోరిక లేదని, కక్ష అంతకన్నా లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. రాజకీయ కారణాలు అసలే లేవని, దీనిపై అపోహలు సృష్టించడం తప్ప మరొకటి కాదన్నారు. 
 
అయితే ఈ అంశానికి కోర్టులో పరిష్కారం లభించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కాబట్టి, రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం చెప్పిందని వివరించారు. ఈ వైఖరిని ప్రతిఘటించాలనుకుంటే ఎవరైనా కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు.