1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2020 (09:28 IST)

జీవీఎల్‌కు బుర్రుందా... రాజధాని మార్పుకు ఏపీ బీజేపీ మద్దతిస్తుందా? ఆర్ఎస్ఎస్

ఏపీ రాజధాని విషయంలో పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావుకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శార్దా కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలను బీజీపే సమర్థిస్తుందా? అసలు ఏపీ రాజధాని మార్పునకు ఏపీ బీజేపీ మద్దతిస్తుందా అంటూ నిలదీశారు. 
 
ఏపీ రాజధాని విషయం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు. పైగా, ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయంపై స్పందించకుండా, విపక్ష నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ వ్యాఖ్యలను నిశితంగా గమనించిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శార్దా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. జీవీఎల్ వ్యాఖ్యలు సాంకేతికంగా సరైనవే అయ్యుండొచ్చని, కానీ కేంద్రం ఇచ్చిన వేలాది కోట్ల రూపాయలు వృథా అవుతుంటే చూస్తూ ఉంటారా? అని ప్రశ్నించారు. 
 
రాజధానికి భూములిచ్చిన రైతుల భవిష్యత్తుతో సీఎం జగన్ ఆడుకుంటుంటే మౌనంగా ఉంటారా?, మూడు రాజధానులు ఓ చెత్త ఆలోచన, దీనికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మద్దతిస్తుందా అంటూ నిలదీశారు. 
 
'రాజ్యాంగపరంగా చూస్తే జీవీఎల్ వ్యాఖ్యలు సబబే కావచ్చు. కానీ కేంద్రం ఏపీకి ఇచ్చిన కోట్లాది రూపాయల నిధులు వృథా అవుతుంటే ఏపీ బీజేపీ చూస్తూ అంగీకరిస్తుందా?' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని దారుణమైన నిర్ణయంగా అభివర్ణించారు. 
 
ఈ సందర్భంగా ఏపీ బీజేపీ పరిస్థితిపైనా వ్యాఖ్యానించారు. వనరుల దుర్వినియోగంపై పోరాడే పార్టీగా, మతమార్పిళ్లకు వ్యతిరేకంగా నిలిచే పార్టీగా ఏపీలోనూ బీజేపీ తనదైన ముద్రవేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అమిత్ షా, జేపీ నడ్డా, సునీల్ దేవధర్ ఏపీ బీజేపీకి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తున్నానని, అందుకు ఇదే సరైన సమయం అంటూ ఆయన పేర్కొన్నారు.