1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 26 ఆగస్టు 2021 (13:47 IST)

ఏపీలో విస్త‌రించేందుకు బిజేపీ విస్తార‌క్ యోజ‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ ఉనికి అంతంత మాత్ర‌మే. అందుకే రాష్ట్రంలో మ‌రింత విస్త‌రించేందుకు ఆ పార్టీ కేంద్ర నాయ‌క‌త్వం విస్తార‌క్ యోజ‌న‌ను ప్ర‌వేశ‌పెట్టింది. 
 
క్షేత్రస్ధాయిలో  కేంద్ర పధకాలకు బిజెపి స్థానిక నేత‌లు విస్తృత ప్రచారం చేస్తున్నారు. విస్తారక్ యోజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని వెయ్యి ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు రేషన్ డిపోలు,  వ్యాక్సిన్ సెంటర్లను పరిశీలించారు. రేషన్ డిపోల ద్వారా బియ్యం పంపిణీ ఎలా జరుగుతోంది?  ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు? అనే విషయాలు తెలుసుకోవడంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ అందిస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించారు. రేషన్ డిపోల వద్ద  ప్రజల ఫిర్యాదులను కూడా తీసుకుని, పరిష్కార మార్గాలు బిజెపి నాయకులు క‌నుగొంటున్నారు.
 
దేశమంతటా కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్న విధానాన్ని ప్రజలకు బిజెపి నేతలు వివరించారు. ఈ విధంగా రెండు రోజుల పాటు పార్టీ కార్యక్రమాన్ని ద్విగ్విజయం చేసినందుకు ఎపి బిజెపి అధ్యక్షులు  సోమువీర్రాజు బిజెపి శ్రేణులను అభినందించారు. పార్లమెంటు నియోజక వర్గాల వారీగా  మండలాల్లో విస్తారక్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ  కార్యక్రమాలను నిర్వహించారు.
 
బిజెపి పధాదికారులతో సహా అందరూ విస్తారక్ లుగా పనిచేయడం విశేషం. జిల్లా, మండల, గ్రామాల వారీగా  కార్యక్రమ పర్యవేక్షణ జరిగింది. 934 మండలాల్లో విస్తారక్ యోజన నిర్వహించారు.ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.  విస్తార‌క్ ద్వారా మ‌రింత విస్త‌రిస్తామ‌ని బీజేపీ నాయ‌కులు చెపుతున్నారు.