కాదని వచ్చారో... మా శవాలను కళ్ళజూస్తారు...
భోగాపురం గ్రామస్తులు మండిపోతున్నారు. కాదూ కూడదని తమ గ్రామాల్లో అడుగు పెట్టి బలవంతంగా భూములు తీసుకునేందుకు ప్రయత్నిస్తే తాము సామూహిక ఆత్మహత్యలకు పాల్పడుతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. తమ వైఖరి ఏమిటో వారు తెగేసి చెప్పారు. విజయనగరం జిల్లా భోగాపురం తహశీల్దారు కార్యాలయంలో ఆర్ డీఓ శ్రీనివాసమూర్తి ఎయిర్ పోర్టు బాధిత గ్రామాల రైతులతో గురువారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఆర్డీవోతో మాట్లాడుతూ, గ్రామాల్లోకి ఎయిర్ పోర్టు పేరుతో ఏ అధికారి వచ్చినా ఆత్మహత్యలు చేసుకుంటాం చెప్పారు. ఎవరూ ఆవేశపడవలసిని పని లేదనీ, గ్రామస్తులు అంగీకారం లేనిదే భూములు సమీకరించమని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అయితే గ్రామస్తు దీనిపై ఘాటైన సమాధానం చెప్పారు. జిల్లా కేంద్రంలో కలెక్టరు వద్దకు చర్చలకు పిలిచి, గ్రామాల్లోకి ముగ్గురు ఉపకలెక్టర్లను ఎందుకు పంపించారని ఆర్ డీఓని నిలదీశారు. ప్రభుత్వం, అధికారులు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.