శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (08:35 IST)

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న సీఎం కేసీఆర్

kcr - thota
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభను ఏపీలో నిర్వహించనున్నారు. ఈ సభను ఎక్కడ, ఎపుడు ఏర్పాటు చేయాలన్న అంశంపై సమాచాలోచనలు సాగుతున్నాయి. 
 
ఇటీవల తెరాసను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మారింది. దీంతో ఈ పార్టీ తొలి శాఖను ఏర్పాటుచేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలు కొందరు బీఆర్ఎస్‌లో చేరారు. వీరిలో సీనియర్ నేత తోట చంద్రశేఖర్ రావు, ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టీజీ ప్రకాష్‌తో పాటు మరికొందరు ఇటీవలే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. 
 
ఇదిలావుంటే, ఏపీలో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించే నిమిత్తం సీఎం కేసీఆర్‌తో చంద్రశేఖర్, పార్థసారథిలు బుధవారం హైదరాబాద్ నగరంలో సమావేశమై చర్చించారు. ఈ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. సభ ఎక్కడ, ఎపుడు నిర్వహిస్తారన్న దానిపై త్వరలోనే వెల్లడించనున్నారు. అలాగే, బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ఏపీలో ప్రారంభించాలని భావిస్తున్నారు.