శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (09:08 IST)

బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్!?

thota chandrasekhar
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఇందులోభాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ శాఖను ఏర్పాటు చేయనున్నారు. ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ను నియమించేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయన్ను ఏపీ శాఖ అధ్యక్షుడుగా ప్రకటించే అవకాశం ఉంది.
 
మరోవైపు, బీఆర్ఎస్‌లో మరికొంతమంది ఏపీ నేతలు సోమవారం చేరనున్నారు. వీరిలో చంద్రశేఖర్‌తో పాటు ఐఆర్టీఎస్ మాజీ అధికారి  రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టేజీ ప్రకాష్‌తో పాటు పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వీరంతా బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. 
 
ఆ తర్వాత ఏపీ పగ్గాలను తోట చంద్రశేఖర్‌కు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర కేడర్‌ ఐఏఎస్‌గా 23 యేళ్లపాటు పని చేసిన ఈయన గత 2009లో పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014లో వైకాపా అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ నుంచి 2019లో జనసేన నుంచి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి ఓడిపోయారు.