మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (12:09 IST)

ఏపీలో మళ్ళీ బై ఎలక్షన్స్, ఉక్కు నగరంలో పోటీలో నిలబడనున్న ఉక్కు కార్మికుడు

ఏపీలో వరుసగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

ఏప్రిల్ 17న ఎన్నిక జరగనుండగా, మే 2న ఫలితం వెలువడనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ, తిరుపతి ఉప ఎన్నికపై కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇక్కడ కూడా భారీ మెజారిటీతో గెలుస్తామని అంచనా వేస్తోంది.
 
అయితే తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఏపీలో మళ్ళీ ఉప ఎన్నిక రానుంది. తాజాగా బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించారు. దీంతో బద్వేలు అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇదే సమయంలో విశాఖ నార్త్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు.
 
రాజీనామా ఆమోదించాలని స్పీకర్‌ని కలిసి మరీ కోరారు. ఇక స్పీకర్ సైతం గంటా రాజీనామాని ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో విశాఖ నార్త్ స్థానానికి బై ఎలక్షన్ జరగొచ్చు. ఇక బై ఎలక్షన్ వస్తే తాను పోటీ చేయనని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగిని పోటీలో పెడతానని గంటా ముందే చెప్పేశారు.

అయితే ఇక్కడ ఎవరు పోటీలో ఉన్నా గెలుపు వైసీపీదే అని చెప్పొచ్చు. ఎందుకంటే తాజాగా జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖ నార్త్ స్థానంలో మెజారిటీ డివిజన్లు వైసీపీకే వచ్చాయి. కాబట్టి ఉప ఎన్నిక వస్తే ఇక్కడ గెలుపు వైసీపీదే.
 
అటు కడప జిల్లాలో బద్వేలు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. ఇక్కడ గెలుపు కంటే వైసీపీకి ఎంత భారీ మెజారిటీ వస్తుందనే విషయం గురించే మాట్లాడుకోవాలి.

2019 ఎన్నికల్లోనే బద్వేలులో వైసీపీకి దాదాపు 44 వేల మెజారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుందనేది చూడాలి. మొత్తానికైతే ఏపీలో మళ్ళీ ఉపఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.