1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 అక్టోబరు 2021 (16:10 IST)

టీడీపీ అధినేత చంద్రబాబుకు గాయం... పునీత్ మృతిపై సంతాపం

తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం స్వల్పంగా గాయపడ్డారు. కుప్పంకు వెళ్లే క్రమంలో ఈ ఉదయం ఆయన బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన కుప్పంకు వెళ్లాల్సి ఉంది. 
 
ఈ క్రమంలో బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు పెద్ద సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు వారు యత్నించారు. 
 
ఈ క్రమంలో చంద్రబాబు చేతికి అనుకోకుండా స్వల్ప గాయమయింది. ఆ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి కుప్పంకు బయల్దేరి వెళ్లారు. రేపటి వరకు చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగనుంది. ప్రస్తుతం ఆయన కుప్పం బస్టాండ్ సెంటర్ వద్ద ప్రసంగిస్తున్నారు.
 
పునీత్ రాజ్ కుమార్ (46) అకాలమరణం చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులుకు, అభిమానులకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాననంటూ ట్వీట్ చేశారు.
 
అటు, జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ, ఈ వార్త వినగానే గుండె పగిలినంత పనైందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇంత త్వరగా వెళ్లిపోతావనుకోలేదు సోదరా అంటూ ఆవేదన వెలిబుచ్చారు. 2016లో విడుదలైన పునీత్ రాజ్ కుమార్ చిత్రం 'చక్రవ్యూహ'లో జూనియర్ ఎన్టీఆర్ 'గెలియా గెలియా' అనే హుషారైన గీతాన్ని ఆలపించారు. ఈ పాటకు గాను ఎన్టీఆర్ కు 'మిర్చి మ్యూజిక్ అవార్డు' కూడా లభించింది.