1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2015 (19:21 IST)

తోటపల్లికి రిజర్వాయర్‌కు నేనే శంకుస్థాపన చేశా.. నేనే ప్రారంభించా.. : చంద్రబాబు

విజయనగరం జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. జిల్లాలో బ్యారేజ్ వద్ద పైలాన్‌ను, ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గరుగుబిల్లి మండలం, ఉల్లిభద్రలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ చంద్రబాబు మాట్లాడుతూ.. గత 2003 నవంబర్ 6వ తేదీన తోటపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాని, తిరిగి 12 సంవత్సరాల తర్వాత తానే ఈ ప్రాజెక్టును ప్రారంభించానని గుర్తు చేశారు. 
 
ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం లక్షా 32వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించినట్టు చెప్పారు. తొలిదశలో భాగంగా 50 వేల ఎకరాలకు గురువారం సాగునీటిని విడుదల చేశారు. 117 కిలోమీటర్ల మేర ఉన్న తోటపల్లి కుడి కాలువ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు నీరు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
 
అంతేకాకుండా, పేదరికంలో ఉండే విజయనగర జిల్లాను అన్ని జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేస్తామని, ప్రజలకు అండగా టీడీపీ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు. రిజర్వాయర్‌ నుంచి విజయనగరం జిల్లాలో 12 మండలాలు.. శ్రీకాకుళంలో 5 మండలాలకు సాగునీరు లభిస్తుందని అయన తెలిపారు. వంశధార, నాగావళి నీటిని సద్వినియోగం చేసుకుంటే ఈ రెండు జిల్లాల్లో కరువు ఉండదన్నారు. రెండు నదుల నీటితో చెరువులు నింపుతామని ప్రకటించారు.