1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (11:59 IST)

అమెరికాలో చిత్తూరు యువతి ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆర్నెల్ల క్రితం ఖాయమైంది. పెళ్లి పత్రికలు కూడా పంచిపెట్టారు. ఇంతలోనే వరుడు తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి... మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ  వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు నగరం పోలీసు కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ(24) అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తోంది. పూతలపట్టు మండలం వడ్డేపల్లె పంచాయతీ బందార్లపల్లెకు చెందిన భరత్‌ అమెరికాలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఆరు నెలల క్రితమే వీరిద్దరికీ పెళ్లి నిశ్చయమవడంతో ఈ నెల 3వ తేదీ ఉదయం 3 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి పత్రికలు కూడా ముద్రించి పంచిపెట్టారు.
 
అయితే.. సుష్మను వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదని భరత్‌ తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ విషయమై ఇరుకుటుంబాల మధ్య పంచాయితీ జరిగింది. అయినా భరత్‌ పెళ్లికి నిరాకరించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మ సోమవారం అమెరికాలో తాను ఉంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సుష్మ బంధువులు గురువారం చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.