శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (23:29 IST)

నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి: జగన్‌

నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని అధికారులకు సూచించారు.

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. క్లాప్‌ కార్యక్రమం కింద ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.

గ్రేడ్‌- 2,3, నగర పంచాయతీలకు క్లాప్‌ కింద నిర్దేశించిన వాహనాలన్నింటినీ కూడా ఆయా నగరాలకు, పట్టణాలకు, నగర పంచాయతీలకు, పంచాయతీలకు చేరవేయాలన్నారు. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను వీలైనంత తర్వగా తెప్పించుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత కంపెనీలతో మాట్లాడుకుని ఆయా వాహనాలను సత్వరమే తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నగరాలు, పట్టణాల్లో గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుంచి సమీప ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు గార్బేజ్‌ను తొలగించడమే కాకుండా దుర్వాసన ఆ ప్రాంతంలో రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గుంటూరు వ్యర్థాలనుంచి విద్యుత్‌ ఉత్పత్తి కర్మాగారం సిద్ధమైందని అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. ప్రతిపాదిత ప్రాంతాల్లో కూడా ఈ ప్లాంట్లపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి తెలిపారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు.

పబ్లిక్‌ టాయిలెట్స్‌ను నిర్మించడంపైనే కాదు, వాటిని పరిశుభ్రంగా ఉంచేలా ప్రత్యేక దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. గ్రామాల్లో డస్ట్‌బిన్స్‌ లేని వాళ్లకు డస్ట్‌బిన్స్‌ ఇవ్వాలని, విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలన్నారు.

గ్రామంలో పారిశుద్ధ్యంపైనా నివేదికలు తెప్పించుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్రమం తప్పకుండా తాగునీటి వాటర్‌ ట్యాంక్‌లను పరిశుభ్రం చేయించాలని పేర్కొన్నారు. ‘వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం దృష్టిపెట్టాలి. మురుగునీటి కాల్వల నిర్వహణపై అధికారులు దృష్టిపెట్టాలి.

ఎక్కడా కూడా మురుగునీరు నిల్వ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. నివాస ప్రాంతాల్లో మురుగునీటి నిల్వ లేకుండా చేయాలి. దీన్నొక సవాల్‌గా తీసుకోవాలి. అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో అత్యాధునిక విధానాలను పాటించాలి.

క్లాప్‌ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ రూపంలో సమర్థులైన అధికారులను పెట్టాలి. వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు.

కార్య‌క్ర‌మంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ పి.బసంత్‌కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి.సంపత్‌కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.