శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 24 మే 2020 (23:34 IST)

పరిసరాల పరిశుభ్రత పాటించాలి: మంత్రి సబితా

వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్  పిలుపునిచ్చిన ‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’  అనే కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో ని పూల కుండీలను శుభ్రం చేశారు. ఇంటి అవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.

దీనిని ఓ సామాజిక కార్యక్రమంగా భావించేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలని  మంత్రి పిలుపునిచ్చారు. సీజనల్‌ వ్యాధులను అరికట్టడంలో ప్రజాప్రతినిధుల సహకారం కోరుతున్నామని, వారి ఇండ్లనుంచే ఈ కార్యక్రమం ప్రారంభంకావాలని ఆయన కోరారు.
 
సీజనల్‌ వ్యాధుల నివారణలో పురపాలకశాఖ ఇప్పటికే ఒక ప్రత్యేక క్యాలెండర్‌ రూపొందించి, వాటిని అరికట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు.  కరోనా నేపథ్యంలో అలవాటైన వ్యక్తిగత పరిశుభ్రతను ఇక ముందు కూడా కొనసాగించి వ్యాధులను దరిచేరకుండా చూద్దామన్నారు.
 
రానున్న వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా వంటి వ్యాధులు రాకుండా చూడాలని కోరారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల పట్ల ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించారని మంత్రి  గుర్తుచేశారు.

ప్రతి వర్షాకాలంలో అనేక సీజనల్‌ వ్యాధులు మనల్ని పట్టిపీడిస్తున్న విషయం తెలుసని, ముందు జాగ్రత్తగా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని కోరారు.