శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 14 మే 2021 (13:41 IST)

ముస్లిం సోదరులకు సీఎం జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలిపారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని, కరోనా మహమ్మారి నుంచి బయట పడి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని పేర్కొన్నారు.
 
పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరసోదరీమణులంతా నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్టగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. అల్లా రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్‌ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని, ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తారని, సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకొంటారని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు.