శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (12:23 IST)

ఇక ఇళ్ళలోనే కరోనా చికిత్స ... ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ వైరస్ వ్యాప్తి కోసం ఎన్నో రకాలైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నా అది అదుపుకావడం లేదు. దీంతో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
కరోనాలక్షణాలు ఉండి, 50 ఏళ్ల లోపువారికి ఇంట్లోనే చికిత్సలు చేయాలని నిర్ణయించింది. పలు నిబంధనలతో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు రూపొందించింది. నిర్వహించే పరీక్షల్లో ఆరోగ్యాంగా ఉండాలని... వైద్యుని సిఫారసుతోనే మినహాయింపు ఉంటుందని పేర్కొంది. కోవిడ్ ఆసుపత్రికి సమీపంలో ఉండాలని... ఇంట్లో ప్రత్యేక వసతులు ఉండాలని తెలిపింది. 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని వైద్యఆరోగ్య శాఖ పేర్కొంది. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో 75శాతం కేసుల్లో కరోనా లక్షణాలు బయటపడలేదు. ఇప్పటివరకు ఉన్న 1403 కేసుల్లో 1050 కేసుల్లో లక్షణాలు కనిపించలేదు. వీరి ద్వారానే కరోనవైరస్ వ్యాప్తి చెందింది. వీరంతా 60 ఏళ్ల లోపువారుగా ప్రభుత్వం గుర్తించింది. ఇకపోతే, గత 10 రోజుల్లోనే కరోనా కేసులు రెట్టింపు అయ్యాయని తెలిపింది. ముఖ్యంగా, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. 
 
ఇదిలావుంటే, విశాఖ జిల్లాలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. మాధవధార ప్రాంతానికి చెందిన ఓ మహిళ(60) కరోనా బారినపడినట్టు నిర్ధారణ అయింది. ఆమె భర్త(66) కిడ్నీ సమస్యతో ఈ నెల 20న మృతిచెందారు. మరుసటిరోజు నిర్వహించిన అంత్యక్రియలకు పలువురు హాజరయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు మృతుడి కుటుంబసభ్యులు ఐదుగురిని క్వారంటైన్‌కు తరలించారు.
 
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కమ్యూనిటీ ఆస్పత్రిలో వైద్యుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేశారు. ఆయనకు నెగెటివ్‌ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వైద్యులతో పాటు సిబ్బందికీ ప్రాథమిక పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినా, మరోసారి వారందరి నమూనాలు సేకరించి కాకినాడ ల్యాబ్‌కు పంపారు. ఐదుగురు వైద్యాధికారులతో సహా 11మంది వైద్యసిబ్బందిని శ్రీకాకుళం క్వారంటైన్‌కు తరలించారు.