శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (16:55 IST)

ఆధార్ లేకున్నా వ్యాక్సిన్ వేసుకోవచ్చు .. ఎక్కడ?

కరోనా వైరస్ బారినపడకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు పదేపదే కోరుతున్నారు. అయితే, చాలా మంది ఏవేవో కుంటి సాకులతో ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వృద్ధులకు ఆధార్ కార్డు లేకున్నప్పటికీ వ్యాక్సిన్ వేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. 
 
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, వ్యాక్సినేషన్‌ అంశాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు వివరాలను ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. అలాగే, కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇందుకోసం 26,325 మంది వైద్య, ఇతర సిబ్బందిని నియమించినట్లు పేర్కొంది. 
 
ఇప్పటివరకు 1955 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, 109 మరణాలు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సుమారు 1300 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. థర్డ్‌వేవ్‌లో పిల్లలకు కరోనా వస్తుందని నిర్ధారణ కాలేదని, అయినప్పటికీ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. వృద్ధులకు ఆధార్‌ లేకుండానే వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.