శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (11:31 IST)

ప్రభుత్వం సాయం చేస్తే రోజుకు పది లక్షల మందికి మందు-ఆనందయ్య

ప్రభుత్వం తనకు సాయం చేస్తే ప్రతి  రోజూ పది లక్షల మందికి సరిపడే మందు తయారు చేసి, పంపిణీ చేయగలనని ఆనందయ్య ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కృష్ణపట్నం సీవీఆర్ కాంప్లెక్లులోని ఓ భవనంలో కరోనా మందులు తయారు చేస్తున్నారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కరోనా మందు పంపిణీ చేసే పనిలో ఉన్నారు. 
 
అయితే ఆనందయ్యకు ఆర్థిక వనరులు లేకపోవడంతో లక్షలాది మందికి ఒకేసారి మందు తయారు చేయలేక పోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మందు తయారీకి అనేక రకాల దినుసులు సేకరించుకోవడంతో పాటు, మరికొన్ని కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆనందయ్య గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం రావడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు వారి సొంత ఖర్చులతో ఆనందయ్యతో మందులు తయారు చేయించి, వారి నియోజకవర్గాల్లో పంపిణీ చేసుకుంటున్నారు. 
 
ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలో మందు తయారీకి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దర్ రెడ్డి ఖర్చు భరించారు. ఇక చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆనందయ్య కుమారుడి సహకారంతో పెద్ద ఎత్తున పీ రకం మందు తయారీ, పంపిణీ ప్రారంభించారు. 
 
తాజాగా కడపలో వైసీపీ ఎమ్మెల్యే రవీంధ్రనాధ్‌రెడ్డి ఆనందయ్య మందు తయారీ ప్రారంభించారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు వారి సొంత ఖర్చుతో ఆనందయ్య మందు తయారు చేయించి వైసీపీ రంగులు, సీఎం ఫోటో, స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలతో వారి వారి నియోజకవర్గాల్లో పంపిణీ ప్రారంభించారు. అయితే ఆనందయ్యకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందేలా కనిపించడం లేదు.