1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 15 నవంబరు 2021 (09:49 IST)

బలపడుతున్న అల్పపీడనం... ద‌క్షిణ ఆంధ్రకు వాయు'గండం

అండ‌మాన్ లో శనివారం ఏర్పడిన అల్పపీడనం ఆదివారం మధ్య అండమాన్ సముద్రంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరి తల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి. మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ అల్ప పీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనంగా ఉత్తర అండమాన్, దానిని ఆను కొనిఉన్న ఆగ్నేయ బంగాళా ఖాతం మీద, నవంబర్ 15 తేదీ కల్లా బలపడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ద్వారా ప్రయాణం కొన సాగించి నవంబర్ 17న మరింత బల పడి వాయుగుండంగా మారుతుంది. 
 
 
ఈ వాయుగుండం దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ దగ్గర నవంబర్ 18 తేదీ కల్లా వచ్చే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ఉత్తర అంతర్గత తమిళనాడు దాని పరిసర ప్రాంతాల మీద నుండి ప్రస్తుతం అంతర్గత కర్ణాటక, ఉత్తర అంతర్గత తమిళనాడు ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.6 కి.మీ ఎత్తులో వరకు వ్యాపించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. 
 
 
ఒక ద్రోణి ఉత్తర అంతర్గత తమిళనాడు మీద ఉన్న ఉపరితల ఆవర్తనము నుండి గంగా పరివాహక ప్రాంత పశ్చిమ బెంగాల్ వరకు ఆంధ్ర, ఒడిశా మీదుగా సముద్ర మట్టమునకు 0.9 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉండి బలహీనపడినదని తెలిపారు. వీటన్నింటి ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
 
 
వాయుగుండం తుపానుగా మారనుందని అయితే అది ఏపిలో ఏదో ఒక ప్రాంతంలో తీరం దాటే అవకా శం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం ఎక్కడ దాటుతుందన్న విష యంలో స్పష్టత లేదు. తుపాను ఏపి తీరానికి దగ్గరగా వచ్చిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.