శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

రైళ్ళలో ప్రత్యేక అదనపు బాదుడు ఆదివారం నుంచే..

దేశంలో కరోనా వైరస్ మహమ్మారికి ముందున్న విధానంలోనే రైళ్లను నడుపుతామని, పాత ఛార్జీలే వసూలు చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. కానీ, ప్రయాణికులకు పూర్తిస్థాయిలో ప్రయోజనాల్ని అందించడంలో పూర్తిగా విఫలమైంది. రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయం తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందని శుక్రవారం రైల్వే శాఖ ప్రకటించింది. అయితే, ‘ప్రత్యేక’ రైళ్ల పేరుతో అదనపు బాదుడుకు శనివారం అర్థరాత్రి (ఆదివారం) నుంచి మాత్రమే స్వస్తి పలికింది. 
 
అదేసమయంలో వయోవృద్ధులు సహా పలురకాల వారికి ఇచ్చే రాయితీల్ని దక్షిణ మధ్య రైల్వే సహా పలు జోన్లు ఇంకా పునరుద్ధరించలేదు. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం ప్రయాణానికి 75 ఏళ్ల వ్యక్తికి టికెట్‌కు ప్రయత్నం చేస్తే సీనియర్‌ సిటిజన్‌ కన్సెషన్‌ రాయితీ లేకుండా పూర్తి ఛార్జీ చూపిస్తోంది. 
 
రానున్న రోజుల్లో ప్రయాణానికి టికెట్లు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు ఛార్జీలను తిరిగి చెల్లిస్తారా? లేదా? అన్న విషయంపైనా స్పష్టత ఇవ్వలేదు. ప్రయాణ దూరం, తరగతి, రైలుని బట్టి ఒక్కో టికెట్‌పై రూ.75-100 నుంచి దురంతో వంటి రైళ్లలో రూ.350-400 వరకు అదనంగా వసూలుచేశారు. 14వ తేదీ నుంచి రెగ్యులర్‌ రైళ్లుగానే నడపనున్న నేపథ్యంలో.. అదనంగా వసూలుచేసిన ఛార్జీలను తిరిగి ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.