శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (13:18 IST)

కర్నూలు జిల్లాలో వజ్రాల వర్షం

మే చివరిలో ప్రారంభమయ్యే తొలకరి జల్లులతో కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి, ఎర్రగుడి, మదనంతపురం, పగిడిరాయి, మద్దికెర మండలం పెరవలి పొలాల్లో వజ్రాన్వేషణ ప్రారంభమవుతుంది. జూన్‌, జూలై వరకు ఇది కొనసాగుతుంది.

జొన్నగిరి నుంచి పెరవలి వరకు ఎస్‌ ఆకారంలో భూగర్భంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు. భూ ఉపరితలానికి చాలా లోతులో ఈ నిక్షేపాలు ఉండడంతో వాటిని తవ్వి తీయడం కష్టమని భావించారు. భూమి పొరల్లో మార్పులు చోటు చేసుకునే సమయంలో నిక్షేపాల్లో ఉన్న కొన్ని వజ్రాలు భూమి ఉపరితలానికి చేరుకుంటున్నాయి. తొలకరి జల్లులు కురిసిన సమయంలో వాటి ఉనికి బయట పడుతోంది. 
 
వ్యాపారుల మాయజాలం
అదృష్టం వరించి వజ్రం దొరికినా, స్థానిక వ్యాపారుల చేతుల్లో వారు మోసపోతున్నారు. వజ్రాన్వేషణ ప్రాంతంలో వ్యాపారులు తమ అనుచరులను నియమించుకుంటారు. ఎవరికైనా వజ్రం దొరికితే వెంటనే వ్యాపారులకు తెలియజేస్తారు. వారిని వ్యాపారుల వద్దకు తీసుకువెళతారు.

తమకు లభించిన వజ్రం విలువ ఎంతో, బహిరంగ మార్కెట్‌లో ఎలా అమ్ముకోవాలో తెలియక వజ్రం దొరికిన వారు వ్యాపారులు చెప్పిన ధరకు వజ్రాన్ని అమ్ముతున్నారు. వజ్రం విలువలో పావలా భాగం కూడా వ్యాపారులు చెల్లించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 
 
ఏటా కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు ఇక్కడి పంట పొలాల్లో లభిస్తుండడంతో వజ్రాల అన్వేషణ కోసం గుంటూరు, విజయవాడ, ఒంగోలు వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా అన్వేషకులు వస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

సమీప ఆలయాలు, పాఠశాలల భవనాల వద్ద వారం పది రోజుల పాటు ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుని వజ్రాల అన్వేషణ సాగిస్తుంటారు. వజ్రం దొరికితే బిడ్డలను బాగా చదివించాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని అన్వేషకులు అంటున్నారు.