శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (14:18 IST)

స్థానిక పోరుకు డిమాండ్ చేసిన జగన్.. ఇపుడు ఇళ్ళపట్టాల పంపిణీ వాయిదావేశారు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనరు వాయిదావేయగా, దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో కరోనా లేదనీ, ఎస్ఈసీ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడం వల్లే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ సర్కారు భావించింది. అయితే, కరోనా వైరస్ పుణ్యమాన్ని ఈ పథకాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. 
 
కరోనా వైరస్‌ వ్యాధి (కోవిడ్‌-19) వ్యాప్తి మొదటి దశ కొనసాగుతున్న దృష్ట్యా జిల్లాలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ముఖ్యంగా జనసమూహాలు లేకుండా చూడాలని ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఉగాది రోజున ఇళ్లపట్టాల పంపిణీ నిర్వహిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తి రిస్కు ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని వాయిదావేసింది. 
 
వచ్చే నెల 14వ తేదీన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ జయంతి ఉన్న దృష్ట్యా ఆ రోజున ఇళ్ల పట్టాలను పంపిణీచేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకొంటోన్నది. 
 
నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ కారణంగా ఎస్‌ఈసీ ఇళ్లపట్టాల పంపిణీని నిలిపేయడంతో కొద్దిరోజులు ఊపిరిపీల్చుకొన్నారు. అయితే మూడు రోజుల క్రితం ఎన్నికల కోడ్‌ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడంతో ప్రభుత్వం మళ్లీ ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. 
 
ఇదేసమయంలో కోవిడ్‌-19 ముప్పు పొంచి ఉండటంతో రెండు, మూడు రోజుల నుంచి ఆయా అధికారవర్గాలు ఆందోళన చెందుతు న్నాయి. స్వల్ప వ్యవధి మాత్రమే ఉండటంతో ఇళ్ల స్థలాలు, పట్టాలు ఈ నెల 25వ తేదీకి సిద్ధంచేయగలమా అన్న ఆందోళనలు రేకెత్తాయి. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మూడు వారాలు ఏప్రిల్‌ 14కి వాయిదా వేయడంతో అధికార వర్గాలకు ఉపశమనం లభించినట్లు అయింది.