శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 5 మే 2019 (10:40 IST)

తలనొప్పికి మసాజ్ చేస్తానని వక్షోజాలను పట్టుకున్న వైద్యుడు

తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ వచ్చిన ఓ మహిళ... చికిత్స కోసం ఓ వైద్యుడు వద్దకు వచ్చింది. తలనొప్పి తగ్గాలంటే మసాజ్ చేస్తానని చెప్పి ఓ గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేశారు. ఆ తర్వాత మసాజ్ పేరిట వక్షోజాలను పట్టుకున్నాడు. దీంతో షాక్‌కుగురైన ఆ మహిళ... అతడి చెర నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ ఉప్పల్‌ చిలుకానగర్‌ బస్తీ ఆస్పత్రిలో ఉప్పల్‌ శివారులోని మేడిపల్లి ప్రాంతంలో నివసించే డాక్టర్‌ బాలరాజు ‌(27) రోగులకు చికిత్స చేస్తున్నాడు. ఈనెల 2వ తేదీన చిలుకానగర్‌కు చెందిన పుష్ఫ అనే మహిళ తలనొప్పిగా ఉండటంతో ఆస్పత్రికి వచ్చి, డాక్టర్ బాలరాజును సంప్రదించింది. 
 
ఆ మహిళను తన పక్కన కూర్చోబెట్టుకున్న వైద్యుడు... తలపట్టుకుని పరిశీలించి మసాజ్ చేస్తే తగ్గిపోతుందని సలహా ఇచ్చాడు. దీనికి ఆ మహిళ సమ్మతించడంతో మరో గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేశాడు. అక్కడ మరో టేబుల్ వద్దకు తీసుకెళ్లి ఓ కుర్చీలో తను కూర్చొన్నాడు. తర్వాత ఆ మహిళతో 'దగ్గరగా కూర్చో. నేను రష్యాలో ఎంబీబీఎస్‌ చదివాను. తలనొప్పికి ప్రత్యేక వైద్యం చేస్తా. ఇట్టే నీ నొప్పి మాయవమవుతుంది' అంటూ నమ్మించాడు. 
 
ఆ తర్వాత ఆ మహిళ వెనుకనిలబడి మసాజ్‌ చేస్తూ కళ్లు మూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత వక్షోజాల్లో కూడా చేతులుపెట్టి మసాజ్‌ చేస్తుండడంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. అయోమయంలో ఉండగానే ఆమె తల వెంట్రుకలు కొన్నింటిని కత్తిరించి దాచుకున్నాడు. భయాందోళనకు గురైన ఆమె అక్కడ నుంచి పారిపోయి, జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పింది. దీంతో వారంతా ఆస్పత్రికి వచ్చి వైద్యుడు బాలరాజును చితక్కొట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.