1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 7 అక్టోబరు 2021 (14:49 IST)

పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి

భారీ భూకంపంతో పాకిస్తాన్ చిగురుటాకులా వణికిపోయింది. పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో సంభవించిన భారీ భూకంపంతో 20మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని హర్నోయ్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి 20 మంది చనిపోయారని, 200 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బలూచిస్థాన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారి నసీర్‌ నాసర్‌ మీడియాకు వెల్లడించారు.
 
ప్రజలంతా నిద్రలో ఉండగా భారీ భూకంపం సంభవించింది. భవనాల పైకప్పులు కూలిపడటంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంపం సంభవించిన ప్రాంతానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. భారీగా భూ ప్రకంపనలు సంభవించడంతో పాకిస్థాన్ ప్రజలు భయాందోళనలతో వణికిపోతున్నారు.