శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (09:57 IST)

రాజీవ్ హంతకుల విడుదల మనసు కలచివేసింది : వెంకయ్య నాయుడు

venkaiah naidu
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకులను స్వేచ్ఛగా వదిలి వేయడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. రాజీవ్ హంతకులందరినీ జైలు నుంచి విడుదల చేయడం తన మనసు కలచివేసిందన్నారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉండాలని ఆయన కోరారు. 
 
దాదాపు 27 యేళ్లకు పైగా జైలుశిక్ష అనుభవిస్తున్న రాజీవ్ హంతకులను సుప్రీంకోర్టు ఆదేశాలో తాజాగా విడుదల చేశారు. దీన్ని తమిళనాడులోని అన్ని పార్టీలు స్వాగతించాయి. కానీ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు శాఖ నేతలు మాత్రం తీవ్రంగా తప్పుబట్టారు. ఇపుడు మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా తప్పుబట్టారు. రాజీవ్ హంతకుల విడుదల తన మనసు కలిచివేసిందన్నారు. 
 
భర్తను వదిలేస్తే లండన్‌కు వెళ్లిపోతాం.. నళిని 
తన భర్త మురుగన్‌ను విడిచిపెడితే లండన్‌కు వెళ్లిపోతామని రాజీవ్ గాంధీ హత్య కేసులోని ముద్దాయిల్లో ఒకరైన నళిని ప్రాధేయపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ హంతకులందరినీ తమిళనాడు ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసిన విషయం తెల్సిందే. 
 
అయితే, నళిని భర్త మురుగన్‌ను తిరుచ్చిలోని శ్రీలంక శరణార్థ శిబిరానికి తరలించారు. దీనిపై నళిని మాట్లాడుతూ, తిరుచ్చిలోని శ్రీలంక శరణార్థ శిబిరంలో మురుగన్‌ను ఉంచారని దాన్ని ప్రత్యేక జైలుగా మార్చనున్నట్టు తెలిపారని ఆవేదన వ్యక్తం చేసింది. లండన్‌లో తమ కుమార్తె హరిత తమ కోసం ఎదురు చూస్తుందని చెప్పింది. తన భర్తను ప్రభుత్వం విడుదల చేస్తే లండన్‌లో ఉన్న తమ కుమార్తె వద్దకు వెళ్లిపోతామని తెలిపింది. 
 
జైలు జీవితం తమకు ఎన్నో అనుభవాలను నేర్పిందన్నారు. బాంబు పేలుడులో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోవడం పట్ల చాలా బాధపడుతున్నామని, తమకు క్షమాభిక్ష ప్రసాదించిన సోనియా కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు మనసు అంగీకరించడం లేదని చెప్పింది. 
 
2008లో ప్రియాంకా గాంధీ తమను జైలులో కలిసినపుడు తండ్రి హత్య గురించి ప్రశ్నించారని, అపుడు భావోద్వేగానికి గురై బోరున ఏడ్చానని తెలిపింది. ప్రియాంకా గాంధీ ఒక దేవదూత అని చెప్పుకొచ్చింది. అయితే, తాము అమాయకులమనే విషయం కాలమే నిర్ణయిస్తుందని నళిని తెలిపింది.