గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (12:16 IST)

బీహార్‌లో కరోనా విలయం.. మరో ఎమ్మెల్యే మృతి

బీహార్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయంసృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడిన అనేక రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా మృత్యువాతపడుతున్నారు. తాజాగా జేడీయూ సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరీ మహమ్మారితో పోరాడుతూ సోమవారం మృతి చెందారు. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 
 
‘మేవాలాల్‌ గత వారం కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో అప్పటి నుంచి పారాస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మహమ్మారితో పోరాడుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు’ అని పార్టీ నేతలు తెలిపారు.
 
బీహార్‌లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేవాలాల్‌ జేడీయూ తరపున తారాపూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జేడీయూ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక.. విద్యాశాఖ మంత్రిగా కేబినెట్‌లో ఆయనకు చోటు కల్పించారు. 
 
కానీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన నాలుగు రోజులకే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు, కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో బీహార్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఆదివారం రాత్రి కర్ఫ్యూ విధించింది. 
 
అంతేకాకుండా మే 15 వరకు విద్యాసంస్థలు అన్ని మూసివేసేందుకు నిర్ణయించింది. మరోవైపు సంక్షోభ సమయంలోనూ విధులు నిబద్దతతో నిర్వర్తిస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఒకనెల బోనస్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.