శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (10:58 IST)

తిరుమలలో శ్రీవారి లడ్డూల కోసం గ్రీన్‌ మంత్ర బ్యాగులు

తిరుమలలో శ్రీవారి లడ్డూల కోసం గ్రీన్‌ మంత్ర బ్యాగులను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ను నిషేధించిన టీటీడీ.. పేపర్, జనపనారలతో తయారు చేసిన బ్యాగులను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
అయితే.. ఆ ప్రత్యామ్నాయ బ్యాగుల ధరలు అధికంగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో టీడీడీ అధికారులు ప్లాస్టిక్‌ రహిత బ్యాగులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐదు లడ్డూలు పట్టే విధంగా బ్యాగును 3 రూపాయలకు, పది లడ్డులు పట్టే బ్యాగులను 6 రూపాయలకు అందిస్తుంది.
 
మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. గత నెల వరకూ వారాంతంలో భక్తుల సంఖ్య 45 నుంచి 50 వేల మధ్యలో ఉంటూ ఉండగా, ఆదివారం నాడు ఈ సంఖ్య 54 వేలను దాటింది. ఆర్టీసీ బస్సుల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక కోటాను ఇవ్వడం, రూ. 300 దర్శనాల కోటా సంఖ్యతో పాటు, తిరుపతిలో జారీ చేస్తున్న టోకెన్ల సంఖ్యను పెంచడంతో భక్తుల తాకిడి పెరిగింది.
 
ఈ క్రమంలో ఆదివారం నాడు మొత్తం 54,218 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. వారిలో దాదాపు 20 వేలమందికి పైగా భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. స్వామి వారికి హుండీ ద్వారా రూ. 3.38 కోట్ల ఆదాయం లభించింది