1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (16:19 IST)

ఆంధ్రాలో నడుస్తున్నవి లాలూచీ రాజకీయాలా... మాజీ ఎంపీ హర్ష కుమార్

రాజమండ్రిలో గురువారం సాయంత్రం నిర్వహించబడిన ఆత్మీయ సమావేశంలో మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాలలోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పార్టీలన్నీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. 


వైకాపా అధినేత జగన్ నేర చరిత్రగల వ్యక్తి అనీ, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి ఆంధ్రాలో రాజకీయం చేస్తున్నారని అసలు ఆంధ్ర రాజకీయాలలో జోక్యం చేసుకునేందుకు కేసీఆర్ ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. జగన్.. కేసీఆర్‌ మద్దతుతో ఆంధ్రాలో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
 
తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ పని చూసుకోవాలే కానీ.. ఆయనకు ఇక్కడ పనేంటంటూ ప్రశ్నించిన ఆయన పనిలో పనిగా తెదేపా, కాంగ్రెస్, జనసేన, బీఎస్పీ పార్టీలన్నీ ఒక్కటేనన్నారు. పవన్ కల్యాణ్‌కు ఆవేశం తప్ప ఆలోచన లేదని, నాయకత్వ లక్షణాలే లేవంటూ కూడా దుయ్యబట్టేసారు. అమలాపురం ఎంపీ సీటుని స్థానికేతరులకు అమ్ముకున్నారనీ... జనసేనను నమ్ముకున్న కార్యకర్తలను, నాయకులను మోసం చేస్తూ పార్టీ టికెట్ల విషయంలో అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

వైకాపా, భాజపా ఒకటేనని హర్షకుమార్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏ పార్టీకి ఓటు వేయాలన్నది మీరే నిర్ణయించుకోండంటూ తన అనుచరులకు, అభిమానులకు సూచించారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటాననీ, ఏ పార్టీకి మద్దతు పలకబోననీ తెలిపారు. కాగా... రాబోయే రోజుల్లో ఒక పార్టీ స్థాపించి మన సత్తా ఏంటో చూపిద్దాం అంటూ అనుచరులలో జోష్‌‌ని పెంచే ప్రయత్నం చేసారు.
 
అయితే... పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన పార్టీలన్నీ ఏమైపోయాయో ఆయనకు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని... జనాలు గుసగుసలాడుకుంటున్నారు.