మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (10:54 IST)

తెలుగు రాష్ట్రాల్లో మండే ఎండలు : గురువారం ఒక్క రోజే 225 మంది మృతి

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఫలితంగా ఎండలు మండిపోతున్నాయి. మండే ఎండల ధాటికి గురువారం ఒక్కరోజే ఏకంగా 225 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
సాధారణంగా వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండటం సాధారణం. అయితే, మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గురువారం తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో అత్యధికంగా 47.5 డిగ్రీలు, రామగుండంలో 46.8, నిజామాబాద్ లో 46.6, హైదరాబాదులో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెంటచింతలలో 47 డిగ్రీలు, గుంటూరులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 
 
ఈ మండే ఎండలకు వడగాలులు తోడవడంతో, తెలంగాణలో 147 మంది చనిపోయారు. అత్యధికంగా కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో 31 మంది చొప్పున ప్రాణాలు విడిచారు. ఖమ్మం జిల్లాలో 27, వరంగల్ జిల్లాలో 23 మంది చనిపోయారు. ఏపీలో 78 మంది చనిపోగా, ప్రకాశం జిల్లాలోనే 36 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఎండలు మరో రెండు మూడు రోజులు ఇలాగే ఉంటాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.