బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (16:44 IST)

కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత... పోలీసులపై తిరగబడిన తమ్ముళ్లు... బాబుకు స్వాగతం

chandrababu
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పర్యటన ఉద్రిక్తంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు బుధవారం మూడు రోజుల పాటు నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. అయితే, కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో చంద్రబాబు ర్యాలీ నిర్వహించాల్సివుంది. అయితే, చంద్రబాబుకు స్వాగతం పలుకకుండా ఉండేలా పోలీసులు పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు కూడా తిరగబడ్డారు. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 
 
కాగా, ఏపీలో సభలు, రోడ్‌షోలను నిషేధిస్తూ వైకాపా ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెల్సిందే. దీంతో చంద్రబాబు సభకు కూడా అనుమతి లేదని పోలీసులు చెప్పి, రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లు పెట్టారు. అయితే, టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రోడ్లపైకి తరలి వచ్చి బ్యారికేడ్లను తొలగించారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో లాఠీ చార్జ్‌లు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో కొందరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. కొన్ని చోట్ల పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశఆరు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఎత్తిపారి ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితుల్లోనే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు. దీంతో కుప్పంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది.