గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (12:20 IST)

హోసూర్‌లో కొట్టేశారు ... హైదరాబాద్‌లో చిక్కారు!

తమిళనాడు హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో పట్టపగలే సిబ్బందిని బెదిరించి రూ.7 కోట్ల విలువైన 25 కేజీలకు పైగా బంగారాన్ని దోచుకున్న ముఠా అనూహ్యంగా సైబరాబాద్ పోలీసులకు చిక్కింది. 
 
శుక్రవారం ఉదయం బ్యాంకు తెరవగానే లోపలికి ప్రవేశించిన ఆరుగురు ముసుగు దొంగలు తుపాకితో సిబ్బందిని బెదిరించి 25 కేజీలకు పైగా బంగారం, లాకర్‌లోని రూ.95 వేల నగదుతో ఉడాయించారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు కర్ణాటకకు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు మూడు బృందాలను బెంగళూరుకు పంపారు. 
 
వారి కోసం గాలిస్తున్న సమయంలోనే ఈ శనివారం సైబరాబాద్ పోలీసులకు ఈ ముఠా చిక్కింది. నిందితుల నుంచి బంగారు ఆభరాణలు, నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 
ముత్తూట్ ఫైనాన్స్‌‌లో 25 కేజీల బంగారం చోరీ 
కొందరు సాయుధ చోరీ ముఠా తమ చేతివాటం ప్రదర్శించింది. ముత్తూట్ ఫైనాన్స్‌కు కన్నం వేసి ఏకంగా 25 కేజీల బంగారాన్ని చోరీచేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని హోసూరులో జరిగింది. ఈ చోరీ కూడా పట్టపగలే జరగడం గమనార్హం. 
 
పోలీసుల కథనం ప్రకారం.. హోసూరు - బాగలూరు రోడ్డులో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి మాస్కులు, హెల్మెట్లు ధరించిన ఆరుగురు దుండగులు ప్రవేశించారు. ఆ సమయంలో లోపల ఐదుగురు సిబ్బంది, ముగ్గురు వినియోగదారులు ఉన్నారు.
 
లోపలికి వచ్చిన దుండగులు తొలుత సెక్యూరిటీ గార్డుపై దాడిచేశారు. ఆ తర్వాత మేనేజర్, నలుగురు సిబ్బందిని తుపాకితో బెదిరించి రూ. 7.5 కోట్ల విలువైన 25 కేజీలకు పైగా బంగారం, లాకర్లలో ఉన్న 96 వేల నగదును ఎత్తుకెళ్లారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు కర్ణాటకకు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు మూడు బృందాలను బెంగళూరుకు పంపారు.