శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 4 జులై 2018 (11:02 IST)

తల్లి ఒడిలోకి చేరిన పాప.. కోఠీ ఆస్పత్రిలో పాపను కిడ్నాప్ చేసిన మహిళ అరెస్ట్

కోఠీ ఆస్పత్రిలో తప్పిపోయిన చిన్నారి అమ్మ ఒడిలోకి చేరుకుంది. బీదర్‌లో పాపను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌ తీసుకొచ్చారు. కోఠి ఆస్పత్రిలో తల్లికి అప్పగించడంతో ఆమె ఆనందానికి అవధు

కోఠీ ఆస్పత్రిలో తప్పిపోయిన చిన్నారి అమ్మ ఒడిలోకి చేరుకుంది. బీదర్‌లో పాపను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌ తీసుకొచ్చారు. కోఠి ఆస్పత్రిలో తల్లికి అప్పగించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాప తల్లి ఒడికి చేరడంతో కుటుంసభ్యులు పోలీసులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో హైదరాబాద్‌‌లోని కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన పాప కథ సుఖాంతమైంది. 
 
ఆరేళ్ల తర్వాత పాప ఫుట్టిందని సంతోషంలో ఉన్న కుటుంబానికి కిడ్నాప్ రూపంలో విషాదం తప్పలేదు. కానీ కిడ్నాప్‌కు గురైన పాపను ఓ మహిళ హైదరాబాద్‌లో ఎంజీబీఎస్‌లో బీదర్‌ బస్సు ఎక్కినట్లు గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చి బీదర్‌ పోలీసులను అలర్ట్ చేశారు. ఏసీపీ చేతన నేతృత్వంలో పది బృందాలుగా విడిపోయిన పోలీసులు బీదర్‌కు వెళ్లి రెండో తేదీ రాత్రంతా స్థానిక పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన మాయలేడి ఫొటోలను పలు పోలీస్‌స్టేషన్లకు పంపి అప్రమత్తం చేశారు. 
 
కోఠి ప్రభుత్వాసుపత్రిలో పాపను కిడ్నాప్‌ చేసిన కిడ్నాపర్‌ బీదర్‌ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర శిశువుని వదిలిపెట్టి వెళ్లిపోయింది. శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శిశువును స్వాధీనం చేసుకున్న బీదర్ పోలీసులు ప్రాథమికంగా వైద్య సేవలు అందించారు. తల్లిఒడిలో ఉండాల్సిన పసికందుకు సకాలంలో తల్లిపాలు అందకపోవడంతో నీరసించిపోయింది. 
 
ఆపై పాప ఆరోగ్యం నిలకడగా మారిన తర్వాత హైదారాబాద్‌కు తీసుకొచ్చి తల్లి ఒడిలోకి చేర్చారు. మరోవైపు కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. శిశువును ఎత్తుకెళ్లిన మహిళను బీదర్‌‌లో కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.