గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 మే 2020 (08:59 IST)

గాంధీ ఆస్పత్రిలో మందు పార్టీ - నానా యాగీ చేసిన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మందు, విందు పార్టీ జరిగింది. నిత్యం ఎంతో రద్దీతో పాటు పూర్తి బందోబస్తు ఉంటే ఈ ఆస్పత్రిలో మందు పార్టీ జరిగింది. పైగా, ఈ మందు పార్టీలో పాల్గొన్నవారిలో ఒకరు ఇంటికి వెళ్లాక గుండెపోటుతో మరణించాడు. దీంతో ఈ మందు పార్టీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గాంధీ ఆస్పత్రిలో అనేక మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. అయితే, శ్రీనివాస్, నరేశ్, నగేశ్‌లు సోదరులు. వీరు కాంట్రాక్టు పద్ధతిలో ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. గత రాత్రి వీరు మరో ఇద్దరితో కలిసి ఆస్పత్రి సెల్లారులో మందు పార్టీ చేసుకున్నారు. తెచ్చుకున్న మద్యం అయిపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో ఫుల్ బాటిల్ తెప్పించుకుని తాగారు. 
 
ఆ తర్వాత తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లారు. ఇంటికి వెళ్లిన కాసేపటికే శ్రీనివాస్ (38) కుప్పకూలి మరణించాడు. అయితే, అతడు గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు భావించారు. మరోవైపు, ఆసుపత్రి సెల్లార్‌లో మద్యం పార్టీ చేసుకున్న విషయం, శ్రీనివాస్ మృతి చెందిన విషయం అధికారులకు తెలియడంతో వెంటనే విచారణకు ఆదేశించారు. 
 
పార్టీ విషయాన్ని తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపడతామని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు చేపడతామన్నారు. నిజానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆస్పత్రిలోకి మద్యంబాటిళ్లు ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 
 
పైగా, సెల్లార్‌లో గంటలతరబడి విందు చేసుకుంటే ఆస్పత్రి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో అడుగడుగునా బందోబస్తు ఉన్నప్పటికీ విందు విషయం పోలీసులు తెలుసుకోలేకపోయారు. లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.