శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (20:11 IST)

తిరుపతిలో పార్లమెంటులో అక్రమపోలింగ్: భారతీయ జనతా పార్టీ

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో యదేచ్ఛగా జరిగిన అక్రమ ఓట్ల పోలింగ్ను రద్దుచేసి తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీచేసి పారదర్శకంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు డిమాండ్ చేశారు.

తిరుపతి ఉప ఎన్నిక జరిగిన తీరు చరిత్రలోనే చూడని విధంగా ప్రభుత్వ అరాచకానికి పరాకాష్టగా మారిందన్నారు. అధికార వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కాంక్షతో భారీగా దొంగ ఓట్లు వేయించి ప్రజాస్వామ్యాన్ని కాలరాచి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని ఆక్షేపించారు.

వైఎస్ఆర్సీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ ఎన్నిక పోలింగ్లో దాదాపు 2 లక్షలకు పైగా దొంగఓట్లు వేయించిందని ఆరోపించారు. ఇందుకు ముందుగానే ప్రణాళికలు రచించి దానిని ఈ రోజు అమల్లో పెట్టారని తెలిపారు.

తిరుపతి పార్లమెంటుకు జరిగే ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకునేందుకు వైకాపా నాయకులు ఐడీలు తయారుచేస్తున్న విషయాన్ని భాజపా బహిరంగంగా తెలిపినా ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.

వైఎస్ఆర్సీపీ చిత్తూరు, నెల్లూరుజిల్లా ల మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోద్భలంతో రాత్రికి రాత్రి తిరుపతి పార్లమెంటుకు జరిగే పోలీంగ్ కేంద్రాలుండే ప్రాంతాలకు బస్సుల్లో భారీగా చేరుకుని ఉదయమే దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు.

అనుమానంతో వారిని ప్రశ్నిస్తే సరైన సమాధానాలు చెప్పక దొరికిపోయారని, భాజపా ఏజెంట్లున్న బూత్లలోనే దొంగఓట్లు వేసినవారిని పట్టుకోవడం జరిగిందని అన్నారు. పోలీసు, రెవెన్యూ, ఎలక్షన్ అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా సేవలందించి రుణం తీర్చుకున్నారని ఆరోపించారు.

స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సిన ఎన్నిక అధికారపార్టీ కనుసన్నల్లో ఏకపక్ష అక్రమ ఓట్లతో సాగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిందని ఆరోపించారు. తక్షణం ఈ తిరుపతి ఉప ఎన్నికను రద్దుచేసి తిరిగి కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.