గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (14:19 IST)

నకిలీ వీసాలతో దేశం దాటుతున్న మహిళల గ్యాంగ్ అరెస్టు

పొట్ట కూటి కోసం, ఉపాధి కోసం దేశం విడిచి కువైట్‌కు వెళ్తున్న మహిళలు ఇమ్మిగ్రేషన్‌ అధికారుల చేతిలో చిక్కారు. నకిలీ వీసాలలో దేశం దాటుతున్నారని ఆరోపించబడి అరెస్ట్‌కు గురయ్యారు. ఈ కేసులో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు 26 మంది మహిళలను అరెస్టు చేశారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళలు ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లేందుకు సంసిద్ధం కాగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని పట్టుకున్నారు. 
 
వారి వద్ద ఉన్న వీసాలు సరైనవి కావని ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు సమాచారం అందడంతో రెండు రోజుల పాటు విదేశాలకు వెళ్తున్న మహిళలపై నిఘా ఉంచారు. వారి వీసాలను తనిఖీ చేసి అవి నకిలీవని తేల్చారు. మంగళవారం ముగ్గరు పట్టుబడగా బుధవారం 23 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కానీ పట్టుబడిన మహిళలపై పోలీసులు కేసులు పెట్టకుండా మానవతా దృక్పథంతో వారిని విడిచిపెట్టాలని గల్ఫ్‌ సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్‌రెడ్డి కోరారు. 
 
జీవనోపాధి కోసం వెళ్లే మహిళలపై ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. వీరంతా దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన ఏజెంట్‌ల చేత మోసపోయారని వెల్లడించారు. ఆ ఏజెంట్‌ల ఆచూకీ కనిపెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పారు. కాగా వీరికి నకిలీ వీసాలు ఎలా వస్తున్నాయి? ఏ ప్రాంతానికి చెందిన ఏజెంట్ల వద్ద వారు ఈ వీసాలు పొందారు? అనే కోణంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు ఈ మహిళలను ఆర్జీఐఏ పోలీస్టేషన్‌కు అప్పగించారు.