ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 28 జూన్ 2021 (18:50 IST)

ఏజెన్సీలో అన్ని గ్రామ సచివాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం

అమరావతి: ఏజెన్సీలోని అన్ని గ్రామ సచివాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడానికి చర్యలు చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. డోలీల సమస్యను శాశ్వితంగా పరిష్కరించడానికి ఒక కార్యాచరణను కూడా రూపొందించామని వెల్లడించారు. అధికారుల క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా గిరిజన సంక్షేమానికి మరింత పటిష్టమైన చర్యలను తీసుకోనున్నామని వివరించారు.
 
సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన గిరిజన సంక్షేమశాఖ సమీక్షా సమావేశంలో పుష్ప శ్రీవాణి మాట్లాడారు. ఏజెన్సీ ఏరియాలో సరైన రహదారి సౌకర్యాలే లేని 1800 గిరిజన గ్రామాల నుంచి రోగులను, బాలింతలను ఆస్పత్రులకు తరలించడానికి డోలీలను ఉపయోగించాల్సిన పరిస్థితులు ఉన్నాయని గుర్తించడం జరిగిందని చెప్పారు.

అయితే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఒక కార్యాచరణను రూపొందిస్తున్నామని వెల్లడించారు. దీనిలో భాగంగానే కొత్తగా బైక్ ఆంబులెన్స్ లను రూపొందించామని, వీటి ద్వారా 1500 గ్రామాలకు నేరుగా చేరుకొని, అక్కడి నుంచి అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించే అవకాశం ఉంటుందని పుష్ప శ్రీవాణి తెలిపారు. మిగిలిన 300 గ్రామాలలో గర్భిణీ స్త్రీలను వారి ప్రసవానికి వారం రోజుల ముందుగానే గర్భిణీ స్త్రీల వసతి గృహాలకు తరలించడం ద్వారా డోలీల అవసరం లేకుండా చేయడం జరుగుతుందని వివరించారు.

ఏజెన్సీ ఏరియాలో ఉన్న గ్రామ సచివాలయాల్లో 501  గ్రామ సచివాలయాలకు ఇదివరకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోగా వీటిలో 300 గ్రామ సచివాలయాలకు ఇదివరకే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. ప్రస్తుతం 251 గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదని, ఈ గ్రామాలకు రూ.39.84 కోట్లతో ప్రత్యామ్నాయ పధ్దతుల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఆర్ఓఎఫ్ఆర్ పథకంలో భాగంగా ఇప్పటికే 1.24 లక్షల మంది గిరిజనులకు 2.28 లక్షల ఎకరాలకు పట్టాలను ఇవ్వడం జరిగిందని, ఇంకా అర్హత కలిగిన గిరిజనులు ఉంటే వారందరికీ కూడా అటవీ భూములపై హక్కు పట్టాలను జారీ చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులు ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.ఏజెన్సీ ఏరియాలో సీజనల్ గా వచ్చే వ్యాధులను నియంత్రించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా ఈ కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

గిరిజనుల్లో ప్రబలుతున్న సికిల్ సెల్, తలసేమియా వ్యాధులను తగ్గించడానికి కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించామని ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ అధికారులు వివరించారు. కోవిడ్ కారణంగా కుటుంబ పెద్దను కోల్పోయిన గిరిజన కుటుంబాలకు రూ.3 లక్షల రుణం, రూ.లక్ష సబ్సిడీని అందించేందుకు ప్రతిపాదనలను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖకు పంపామని తెలిపారు. ఈ పథకం మంజూరైన వెంటనే గిరిజనులకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు.

సాధ్యమైన త్వరగా  పథకం మంజూరుకు కృషి చేస్తున్నామని పుష్ప శ్రీవాణి తెలిపారు. కాగా రాష్ట్ర స్థాయిలో పని చేసే అధికారులతో పాటుగా జిల్లా స్థాయిలో పని చేసే డీడీలు, డీటీడబ్ల్యుఓలు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. గిరిజన విద్యాసంస్థలను ఆకస్మిక తనిఖీలు చేసి, అవసరమైన చోట చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన విద్యాసంస్థల్లో బోధనా ప్రమాణాలు పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బాలికలకు సంబంధించిన ఆశ్రమ పాఠశాలల్లో మహిళలే ప్రధానోపాధ్యాయులుగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గిరిజన గురుకులాల పర్యవేక్షణ కోసం సోషియల్ వెల్ఫేర్ తరహాలో జిల్లా సమన్వయ అధికారి (డిసీఓ)లను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పు చేసిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన కేసుల్లో విపరీతమైన జాప్యాన్ని నివారించాలని, నిర్దిష్టమైన కాల వ్యవధిలోనే ఆ కేసులను పరిష్కరించాలని కూడా అధికారులకు ఆదేశాలను జారీ చేసారు.

గిరిజన సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న కుక్, కమాటీ, వాచ్ మెన్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కాగా ప్రభుత్వం సబ్ ప్లాన్ కింద కేటాయించే నిధులను పూర్తి స్థాయిలో గిరిజన సంక్షేమం కోసం ఖర్చు చేయాలని, ఈ నిధుల వినియోగంలో వెనుకబడిన ప్రభుత్వ శాఖలతో మాట్లాడి ప్రభుత్వం ఇచ్చిన నిధులు పూర్తిగా సద్వినియోగమైయ్యేలా చూడాలని పుష్ప శ్రీవాణి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, డైరెక్టర్ రంజిత్ బాషాతో పాటుగా జేడీలు, డీడీలు పాల్గొన్నారు.