మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 21 జనవరి 2021 (20:03 IST)

రూ.5,500 వేల కోట్లతో రాష్ట్రంలో ఇంటర్నెట్ సౌకర్యం: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

ఉత్తరాంధ్రలో ఊహించని స్థాయిలో పారిశ్రామిక, పర్యాటకాభివృద్ధి జరుగుతోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరిలో సీఐఐ ఆధ్వర్యంలో భారీ పారిశ్రామిక సదస్సు జరుగుతుందన్నారు. పరిశ్రమలు, పర్యాటక రంగాల అభివృద్ధి లక్ష్యంగా త్వరలో అంతర్జాతీయ స్థాయి పర్యటన చేయనున్నామనీ, ఆ తేదీల వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.
 
అలాగే రూ.5,500 వేల కోట్ల ఖర్చుపెట్టి రక్షణ, భద్రత ప్రమాణాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించబోతున్నామన్నారు. మెడ్ టెక్ జోన్ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, అత్యద్భుత వైద్య రంగ తయారీ పరికరాలకు చిరునామాగా మారుతుందన్నారు. మెడ్ టెక్ జోన్‌తో ఆర్టీపీసీఆర్ సహా ప్రజలకు మరింత సులువుగా వైద్యసేవలు, చౌకగా వైద్య పరికరాల తయారీ జరుగుందని చెప్పారు.
 
కచ్చితంగా ప్రపంచంతో పోటీ పడే వైద్య పరికరాల తయారీ యూనిట్‌గా ఏపీఎమ్ జెడ్ నిలుస్తుందనీ, పాలనా రాజధానిగా  ముఖ్యమంత్రి విశాఖను ప్రకటించిన నేపథ్యంలో మరింత వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రకరకాల సంస్కరణలతో వ్యవస్థల బలోపేతానికై ప్రభుత్వ కృషి చేస్తోందన్నారు.
 
అందువల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి వాతావరణం ఏర్పడిందని వెల్లడించారు. జపాన్, తైవాన్ దేశాల తయారీ కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఐ.టి రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ప్రాధాన్యత ఏర్పడిందనీ, అందుకే పల్లె పల్లెలోని ఇంటింటికీ ఇంటర్నెట్ అందించనున్నామని అన్నారు. విశాఖలో ఐ.టీ, సంబంధిత సేవలను మరింత విస్తరిస్తామనీ, వలస కార్మికులను, వలసపోయిన వారందరినీ తిరిగి ఏపీకి రప్పిస్తామంటూ చెప్పారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' జరుగుతున్న తీరుపై దృష్టి పెట్టామని అన్నారు. క్షేత్రస్థాయిలో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు ఏవైనా ఇబ్బందులు, సమస్యలు వచ్చినా ఈవోడీబీ వేదికగా వెంటనే పరిష్కారం జరుగుతుందన్నారు. జిల్లాల వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని ఒక తాటిపై తీసుకువచ్చి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మేకపాటి అన్నారు.