1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జనవరి 2024 (11:09 IST)

నింగిలోకి దూసుకెళ్లిన ఎక్స్‌పోశాట్...

pslvc58
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కొత్త సంవత్సరంల తొలి రోజున ప్రయోగించిన ఎక్స్‌పోశాట్ ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఎక్క్ రే పొలారిటీమీటర్ ఉపగ్రహాన్ని ఎక్స్‌పోశాట్ ఇస్రో దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటరులో సోమవారం ఉదయం 9.10 గంటలకు ఎక్స్‌పోశాట్‌తో పీఎస్‌ఎల్వీసీ58 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగసింది. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్ధేశిత కక్ష్యలోకి చేరుకుంది. 
 
ఎక్స్‌పోశాట్‌తో పాటు తిరువనంతపురం ఎల్.బి.ఎస్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజీ విద్యార్థినిలు తయారు చేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ చిన్న ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపించింది. ప్రయోగం చివరి దశలో పీఎస్ఎల్వీ మరో పది రకాలతో కూడా పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 
 
కాగా, ఐదేళ్ల జీవితకాలంతో రూపొందిన ఎక్స్‌పోశాట్ ప్రధాన లక్ష్యం కృష్ణబిలాల అధ్యయనమని ఇస్రో తెలిపింది. ఎక్స్‌రే ఫొటాన్లు, వాటి పొలరైజేషన్ ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్‌పై ఎక్స్‌పోశాట్ అధ్యయనం చేయనుంది. అమెరికా తరువాత ఇలాంటి ప్రయోగం చేపట్టిన దేశం భారత్‌యేనని ఇస్రో వర్గాలు తెలిపాయి.