సోమవారం, 28 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 25 అక్టోబరు 2024 (12:01 IST)

జగనన్న ఒక బండరాయిలా మారిపోయాడు: గద్గద స్వరంతో వైఎస్ షర్మిల

sharmila Reddy
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మలకి మధ్య నానాటికి అంతరం పెరుగుతూ వస్తోంది. జగన్ వైసిపి స్థాపించినప్పుడు తను జగనన్న వదిలిన బాణం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి వైసిపి అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేసారు వైఎస్ షర్మిల. ఐతే ఆ తర్వాత ఏవో కొన్ని కారణాల వల్ల ఆయనకు దూరంగా వుంటూ వచ్చారు. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. అనంతరం ఆమెకి కాంగ్రెస్ అధిష్టానం ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవిని కట్టబెట్టింది. ఇక అప్పట్నుంచి జగన్ మోహన్ రెడ్డికి-షర్మిలకు దూరం మరింత పెరుగుతూ వచ్చింది.
 
ఈ క్రమంలో వైసిపికి చెందిన నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. దీనిపై ఓ మీడియా ఛానల్ తో షర్మిల మాట్లాడుతూ... " రాక్షస సైన్యాన్ని ఏర్పాటు చేసి నాపై ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్‌కి జగనన్నతోపాటు సజ్జల, ఆయన కుమారుడు అందరూ వున్నారు. చివరికి నన్ను రాజశేఖర రెడ్డిని బిడ్డను కాదంటూ దారుణంగా ట్రోల్స్ చేసారు. రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు భిన్న రాజకీయ పార్టీల్లో వుండటంలేదా. పార్టీ విధానాలను బట్టి ఆయా వ్యక్తులు వివిధ పార్టీల్లోకి వెళ్తుంటారు. అంతమాత్రాన వేరే పార్టీలో వుంటే చంపుకునేంత పగ పెంచుకోవాలా.
 
జగనన్న కోసం ఊరూరా తిరిగాను. ఆయనకు అధికారం రావాలని ఎంతో శ్రమించాను. అలాంటి నన్ను ఎవరెవరితోనూ నానా మాటలు అనిపిస్తున్నారు. ఆయన ఒక బండరాయిలా మారిపోయారు'' అంటూ గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేసారు వైఎస్ షర్మిల.