గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (15:07 IST)

రాజధాని రైతులకోసం ప్రధాని మోదీని కలుస్తా...: సీఎం జగన్‌కు పవన్ వార్నింగ్

అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రాజధాని రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆయన శుక్రవారం రైతులను కలుసుకునేందుకు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉంటే విచారించి చర్యలు తీసుకోవాలి. అక్రమాల పేరు చెప్పి రైతుల పొట్ట కొట్టడం మంచిది కాదని హితవు పలికారు.

పైగా, అవినీతి ఉందని తేలితే చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ రెడ్డి వైసిపి అధినేత పాలన సాగిస్తున్నారు.. తప్ప.. సీఎంగా భావించడం లేదు.  ఈ ప్రాంత రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప టిడిపి కాదు. ఈ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకుని రాజధాని ఇక్కడే ఉండేలా ప్రకటన చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణకు మేం వ్యతిరేకం కాదు.. ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకోం. రాజధాని విషయంలో అవసరమైతే ప్రధాని మోడీ, అమిత్ షాలను కలుస్తాం.
 
ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోతే ఎంత దూరమైనా పోరాటం చేస్తాం. మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితులను అర్థం చేసుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది. అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు జగన్ కూడా అంగీకరించారు. రాజధాని రైతుల్లో నెలకొన్న ఆందోళనపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి.  తిరుగులేని విజయాన్ని అప్పగించిన జగన్ రెడ్డి ఇంకా ఎందుకో ఆందోళన చెందుతున్నారు. వంద రోజుల వరకు మాట్లాడకూడదు అని మేం భావించినా.. ప్రభుత్వం మేము మాట్లాడేలా‌ చేసింది.
 
రాజధాని రైతులు భూములిచ్చి, పనులు లేకానేక ఇబ్బందులు పడుతున్నారు. 90 రోజుల జగన్ పాలనలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మంచి చేస్తారని సిఎం‌ను‌ చేస్తే... ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. గతంలో భూసేకరణను కూడా మేం‌ వ్యతిరేకించాం. ఇప్పుడు రాజధాని మార్పును కూడా వ్యతిరేకిస్తున్నాం.. రైతులకు జనసేన అండగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.