మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (18:53 IST)

అమరావతి రాజధాని నగరం ఎందుకు కట్టరు? నేనొస్తున్నా: పవన్ అమరావతి పర్యటన

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక రాజధాని నగరంపై అప్పటి తెదేపా ప్రభుత్వం పలు పరిశీలనలు చేసి ఎట్టకేలకు అమరావతిలో రాజధానిని నిర్మించాలని సంకల్పించింది. అందుకుగాను ప్రణాళికలు, కేటాయింపులు చేసింది.

కానీ అమరావతి నగర నిర్మాణం నత్తనడకన సాగిందని ప్రస్తుత పాలక పక్షం అంటోంది. పైగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో రాజధాని నగరం శ్రేయస్సు కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడంతో దీనిపై దుమారం చెలరేగింది. 
ఈ నేపధ్యంలో అమరావతి నగరానికి తమ భూములను ఇచ్చిన పలువురు రైతులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాజధాని నగరం నిర్మిస్తామంటే తామంతా భూములు ఇచ్చేశామనీ, ఇప్పుడు అక్కడ రాజధాని నిర్మించకుంటే తమ పరిస్థితి ఏమిటని వారు వాపోయారు. దీనితో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆగస్టు 30 (శుక్రవారం) అమరావతిని సందర్శించనున్నారు.
 
మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు ఆ ప్రాంతానికి తమ భూములు ఇచ్చిన రైతులలో ఆందోళనలను రేకెత్తించాయి. కాగా పవన్ తన పర్యటనలో, అంతకుముందు టిడిపి ప్రభుత్వం ప్రారంభించిన అమరావతిలో నిర్మాణ పనులు, స్థలాలను సందర్శిస్తారు.

అలాగే రాజధాని ప్రాంత రైతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. మంగళగిరి పాత బస్‌స్టాండ్ నుండి ప్రారంభించి యెర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్లూరు గ్రామాలలో కొనసాగుతుంది.