1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 జూన్ 2021 (18:17 IST)

బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం ఎంపిక వ్యవహారంలో గందరగోళం

కడప బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం ఎంపిక వ్యవహారం చిలికి చిలికి గాలివాన మారుతోంది. మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో 20 మంది పీఠాధిపతులు 2021, జూన్ 12వ తేదీ శనివారం సాయంత్రం బ్రహ్మంగారి మఠానికి వస్తున్నారు. శైవక్షేత్రం నుంచి శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, మరో 9 మంది స్వామలు బయలుదేరగా…తెలుగురాష్ట్రాల నుంచి సాయంత్రానికి మరో 11 మంది పీఠాధిపతులు, స్వాములు చేరుకోనున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
ముందస్తు జాగ్రత్తలో భాగంగా అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు. పీఠాధిపతులను కలవాలంటే ప్రత్యేక పాస్ లు తీసుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ మంది జనాలు గుమికూడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్రహ్మంగారి మఠం దేవాలయానికి వెళ్లే దారులను బ్యారికేడ్‌లతో మూసివేశారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
 
శైవక్షేత్ర పీఠాధిపతి శివయ్య స్వామితో పాటు మరి కొందరు దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి మెదటి భార్య కుమారునికి పీఠాధిపత్యం అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివయ్య స్వామి వాదనను విశ్వబ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మారుతీ మహాలక్ష్మి కుమారుడు గోవింద స్వామికే పీఠాధిపత్యం అప్పగించాలని విశ్వబ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.