1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (12:15 IST)

ప్రజా మద్దతు ఉంటే మీరెందుకు ప్రచారానికి వచ్చారు గీతమ్మా.. వైకాపా ఎంపీకి చుక్కెదురు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో అధికార వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనేక ప్రాంతాల్లో మంత్రులు, ఎంపీల వాహనాలను అడ్డగిస్తున్నారు. ప్రజామద్దతు ఉంటే మీరెందుకు ప్రచారానికి వస్తున్నారంటూ నిలదీస్తున్నారు. పైగా, అనేక చోట్ల వైకాపా అభ్యర్థులపై ప్రజలే రెబెల్ అభ్యర్థులను పోటీకి దించారు. 
 
తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉన్న తిమ్మాపురంలో కాకినాడ ఎంపీ వంగా గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు విచ్చారు. ఆమెకు స్థానికుల నుంచి చుక్కెదురైంది. కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురంలో వైసీపీ మద్దతు తెలిపిన గ్రామ సర్పంచ్‌ అభ్యర్థికి మద్దతుగా ఆదివారం రాత్రి మంత్రి కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణతో కలసి స్థానిక ఎస్సీ పేటలో ప్రచారం చేయడం కోసంవచ్చారు. 
 
ఈ సందర్భంగా స్థానిక ఎస్సీ పేటవాసులు ఎంపీ ప్రచార రథాన్ని అడ్డగించారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి నుంచి సీఎం జగన్‌ వరకు ఎస్సీలంతా సమష్టిగా ఓట్లేశామన్నారు. స్థానిక సర్పంచ్‌ అభ్యర్థి, అనుచరులు తమపై దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడడం, సంక్షేమ కార్యక్రమాలు, ఇళ్ల స్థలాలు అందకుండా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
 
అతనిపై ఉన్న అసంతృప్తితో ఇండిపెండెంట్‌ సర్పంచ్‌ అభ్యర్థికి మద్దతు తెలిపామన్నారు. ప్రజల మద్దతు ఉంటే అభ్యర్థి తరపున పంచాయతీ ఎన్నికల్లో మంత్రి కన్నబాబు, ఎంపీగా మీరు ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ గీతను ప్రశ్నించారు. ఈ విషయమై మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సర్ది చెప్పారు.