శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (17:22 IST)

సీఎం జగన్‌ను అభినందించాల్సిందే.. ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయాణ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డిని అభినందించాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. పైగా, ఆయన అస్సలు ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. ఇంతకీ జగన్ చేసిన పనేంటో ఓ సారి తెలుసుకుందాం. 
 
వైజాగ్‌లోని ఎల్జీ పాలిమర్స్ అనే రసాయన ఫ్యాక్టరీ నుంచి విషవాయువు గురువారం వేకువజామున లీకైంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, మరో 200 నుంచి 500 మంది వరకు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. విషయం తెలుసుకున్న సీఎం జగన్ ప్రత్యేక విమానంలో అమరావతి నుంచి వైజాగ్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి, చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి ఆర్థికసాయం చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే వెంటిలేటర్‌పై చికిత్స పొందేవారితో పాటు.. అస్వస్థతకు లోనైన వారికి, చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు కూడా నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.
 
ఇదే కన్నా లక్ష్మీనారాయణకు బాగా నచ్చింది. నిజానికి ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు మృతుల కుటుంబాలకు కేవలం రూ.కోటి ఆర్థికసాయం చేయాలంటూ సీఎం జగన్ ప్రకటించక ముందు డిమాండ్ చేస్తూ వచ్చాయి. కానీ, సీఎం వైజాగ్ చేరుకున్న తర్వాత రూ.కోటి ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో విపక్షాల నోట్లో పచ్చవెలక్కాయపడినట్టయింది. ఈ విషయంపైనే కన్నా లక్ష్మీనారాయణ ప్రశంసల వర్షం కురిపించారు.