1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (17:43 IST)

ఆంధ్రప్రదేశ్ బాటలో కేరళ.. సాగు విధానాలపై ఆసక్తి

కేరళ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బాటలో పయనించేందుకు సిద్ధంగా వుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సాగు విధానాలపై కేరళ ఆసక్తి కనబరుస్తోంది. అందుకే ఏపీ విధానాలపై అధ్యయనం చేయడానికి కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని పంపిందని వైసీపీ ఎంపీ, పార్టీ ప్రధానకార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు.

జగన్ సర్కారు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం అద్భుతమని ప్రశంసలు కురిపించినట్టు ఆయన ఓ ట్వీట్ చేసి వెల్లడించారు. ఇక్కడ రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయ విధానాలను అధ్యయనం చేయమని ఆ రాష్ట్ర ప్రభుత్వం మంత్రిని పంపినట్టు తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్ విధానాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. భవిష్యత్ జన్యుపరంగా అభివృద్ధి చేసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను ఏపీ ప్రభుత్వం సకాలంలో రైతులకు అందిస్తుందని, నూతన విత్తన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెచ్చిందని వివరించారు. దేశంలోనే తొలిసారిగా జగన్ సారథ్యంలో ఈ నూతన విత్తన విధానం వచ్చిందని తెలిపారు. సకాలంలో నాణ్యమైన విత్తనాలను రైతన్నలకు అందించడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు.
 
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోకి ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి ఆర్‌బీకే పనితీరును పరిశీలిస్తున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. కేరళ బృందాలు కూడా రాష్ట్రానికి వచ్చాయని వివరించారు. గతంలో మన రాష్ట్ర అధికారులు వేరే రాష్ట్రాలకు వెళ్లి సాగు విధానాలపై పరిశోధనలు చేసేవారని, పరిశీలనలు చేసేవారని తెలిపారు. కానీ, నేడు ఆ పరిస్థితులు మారిపోయాయని పేర్కొన్నారు. వేరే రాష్ట్రాల అధికారులే మన రాష్ట్రంలోకి వస్తున్నారని తెలిపారు. 
 
‘ఆంధ్రప్రదేశ్‌లో పైసా ఖర్చులేకుండా నాణ్యమైన విద్య. క్యూబా మాదిరిగా వైద్యరంగంలో విప్లవం. ఫ్యామిలీ డాక్టర్లు కాన్సెప్ట్. రైతులకు సర్వం సమకూర్చుతూ యూఎన్‌వో దృష్టిని ఆకర్షించిన ఆర్బీకేలు. సగానికి పైగా పదవులతో మహిళా సాధికారత. పేదలకు 31 లక్షల ఇళ్లు. ఓర్వలేని విపక్షాలు.’ అంటూ మరో ట్వీట్ చేశారు.