మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (15:06 IST)

నిరూపిస్తే సెటిల్ చేస్తా: కేశినేని నాని

కేశినేని ట్రావెల్స్ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను ఎంపీ కేశినేని నాని ఖండించారు. ట్రావెల్స్‌లో పనిచేసిన ఎవరికీ బకాయి పడలేదని స్పష్టం చేశారు. గుంటూరు లేబర్ కోర్టులో 14 మంది మాత్రమే కేసు పెట్టారని, కోర్టు ఆదేశాల మేరకు నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నానని నాని స్పష్టం చేశారు. 
 
నిజంగా బకాయిపడ్డట్లు ఆధారాలు చూపిస్తే.. సెటిల్ చేస్తానని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మందికి జీతాలు ఇవ్వలేదని ట్వీట్లు చేస్తున్నవారు.. ఆ వందల మంది కార్మికులు ఎవరో చూపించాలని సవాల్ విసిరారు. ఎవరి ట్వీట్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని నాని స్పష్టం చేశారు. 
 
అంతకుముందు... టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నానికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. వేతనాల కోసం ఆ సంస్థ సిబ్బంది ధర్నాకు దిగారు. లెనిన్ సెంటర్ వరకు ప్రదర్శనగా వెళ్లిన కార్మికులు అక్కడ నిరసనకు దిగారు. తమకు బకాయిపడిన వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
అదేసమయంలో తమకు జీతాలు చెల్లించకుండా కేశినేని ట్రావెల్స్ మూసివేశారని పలువురు కార్మికులు కార్మిక కోర్టును ఆశ్రయించారు. కేశినేని నాని కుటుంబానికి చెందిన కేశినేని ట్రావెల్స్‌కు దాదాపు 90 ఏళ్ల చరిత్ర ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులకు ప్రతి రోజుల వందల సంఖ్యలో కేశినేని ట్రావెల్స్ సర్వీసులను నడిపేది. 
 
అయితే 2017లో నాటి ఏపీ రవాణా శాఖ కమీషనర్ సుబ్రమణ్యంతో ఎంపీ నాని, ఎమ్మెల్యే బొండా ఉమా గొడవపడటంతో అది వైరల్ అయ్యింది. దీనికితోడు భారీగా ప్రైవేట్ బస్సులను నడుపుతూ ఆర్టీసీ ఖజానాకు గండికొడుతున్నారని విపక్షాలు సైతం ఆందోళనకు దిగడంతో 2017 ఏప్రిల్ 7న కేశినేని ట్రావెల్స్‌ను మూసివేస్తున్నట్లు సంస్థ అధినేత కేశినేని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ సంస్థ బస్సులు రోడ్లపై తిరగడం లేదు. 
 
కేశినాన్ని తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో ఆ సంస్థలో పని చేస్తూ వచ్చిన వందలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. అప్పటివరకు వారికి చెల్లించాల్సిన బకాయిలను కూడా ఇప్పటివరకు చెల్లించలేదు. ఈ బకాయిల కోసం కేశినేని ట్రావెల్స్‌కు చెందిన ఉద్యోగులు కోర్టుమెట్లెక్కారు.