శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 19 జులై 2019 (09:56 IST)

చిరంజీవిగారి లాగా జెంటిల్మెన్ని కాదు... పట్టువదలని ప్రసాద్‌ని...

విజయవాడకు చెందిన వైకాపా నేత, పీవీపీ సంస్థల యజమాని పొట్లూరి వరప్రసాద్ మరోమారు రెచ్చిపోయారు. తనను ఉద్దేశ్యపూర్వకంగా విమర్శించిన విజయవాడ సిట్టింగ్ ఎంపీ, టీడీపీ నేత కేశినేని ఉద్దేశించి శుక్రవారం మరో ట్వీట్ చేశారు. తాను ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించేందుకు మహాత్ముడిని కాదన్నారు. పైగా, ఏ ఒక్కరినీ వదలబోమని ఆయన హెచ్చరించారు. 
 
గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, కేశినేని నాని, బుద్ధా వెంకన్నా (టీడీపీ ఎమ్మెల్సీ), పీవీపీ వరప్రసాద్‌ల మధ్య ట్వీట్ల వార్ సాగుతోంది. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మరికొన్ని ట్వీట్లు చేశారు. 
 
"చిల్లర వాగుడు వాగే వెధవలను వదిలేయడానికి, ఇంకో చెంప చూపించమనే, మహాత్ముడిని కాదు! చిరంజీవిగారి లాగా జెంటిల్మెన్‌ని కాదు. పట్టువదలని ప్రసాద్‌ని, అలియాస్ పీవీపీ. నిన్ను వదల బొమ్మాళి.. సారీ, బేతాళ" అంటూ పేర్కొన్నారు. 
 
అంతముందు "కలవరమాయే మదిలో! నా మదిలో.. కన్నుల్లో మనస్సే ప్రేమ మందిరమాయే.. ఆ ప్రియుడు ఎవరు రాజా??? చంద్రబాబా.. ఇంకొకరా? కలికాలం సుమీ.. ఏమిటి రంకు.. బొంకు??" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
గురువారం ఇలాగే ఓ ట్వీట్ చేశారు. "తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్ర గాడిని కాదు. వేల కోట్లతో వ్యాపారాలు చేసి వేలాది ఉద్యోగాలు సృష్టించాము. వేల కోట్లు బ్యాంకులకు ఎగొట్టడమెలాగో మీ "గురువు"గారిని అడిగి చెపితే మేము ఆ కొత్త బిజినెస్ నేర్చుకుంటాము" అంటూ ట్వీట్స్ చేశారు. దీంతో విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.