బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 డిశెంబరు 2021 (15:54 IST)

వ్యవసాయక్షేత్రంలో సాయితేజ శాశ్వతనిద్ర - అంత్యక్రియలు పూర్తి

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి కొండ అటవీ ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రమాదంలో మృతి చెందిన చిత్తూరు జిల్లా ఎగువ రేగడ గ్రామానికి చెందిన బి.సాయితేజ అంత్యక్రియలు ఆదివారం పూర్తి సైనిక లాంఛనాల మధ్య ముగిశాయి. గ్రామంలోని వారి సొంత వ్యవసాయక్షేత్రంలో వీటిని పూర్తిచేశారు. 
 
ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దంపతులు, మరో 11 మంది మృత్యువాతపడిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదం నుంచి హెలికాఫ్టర్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రం ప్రాణాలతో బయటపడి బెంగుళూరులోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
అయితే, ఈ ప్రమాదంలో చనిపోయినవారి శరీరాలు బాగా కాలిపోవడంతో గుర్తుపట్టలేకపోయారు. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు చేసి మృతుల కుటుంబాలకు భౌతికకాయాలను అప్పగించారు. ఈ క్రమంలో సాయితేజ భౌతిక కాయాన్ని గుర్తించారు. ఆ తర్వాత శనివారం ఢిల్లీ నుంచి బెంగుళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌కు తరలించారు. అక్కడ సైనిక లాంఛనాల అనంతరం కమాండ్ ఆస్పత్రికి తరలించారు. 
 
ఆదివారం చిత్తూరు జిల్లా ఎగువరేగడ స్వగ్రామానికి తరలించారు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు సాయితేజ కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో సాయితేజ అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ అంత్యక్రియల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరినారాయణ్ పర్యవేక్షించారు.
 
కాగా, అంత్యక్రియలకు జనం భారీగా తరలివచ్చారు. పొరుగు గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఉదయం నుంచే ఎగువ రేగడకు పోటెత్తారు. అంత్యక్రియల సందర్భంగా సాయితేజ అమర్ రవే అంటూ నినాదాలలతో హోరెత్తించారు. దేశ మాత ముద్దుబిడ్డ సాయితేజకు ఘనంగా కడసారి వీడ్కోలు పలికారు. 
 
అంతకుముందు సాయితేజ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యుల సందర్శన కోసం ఆయన నివాసం వద్ద కొద్దిసేపు ఉంచారు. ఆ తర్వాత భారీగా తరలివచ్చిన ప్రజలు అంతిమయాత్రలో పాల్గొనగా భౌతికకాయాన్ని వ్యవసాయక్షేత్రానికి తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు.