మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (22:41 IST)

ఇంట్లోకి వెళ్లి దాక్కోవడం లోకేశ్‌కు అలవాటు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

గతంలో చంద్రబాబు అవినీతిపై 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తకం వేశామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ మాట్లాడారు.

సచివాలయ నిర్మాణం, ఇసుక, సదావర్తీ భూములు, చంద్రన్న కానుకలు, ఫైబర్ గ్రీడ్, విశాఖ ల్యాండ్ స్కాం, క్యాపిటల్ ల్యాండ్ స్కాం... ఇలా టిడిపి హయాంలో జరిగిన దోపిడీని బయటపెట్టామని అనిల్ గుర్తు చేశారు. చంద్రబాబు అన్ని స్కీంలను స్కాంలుగా మార్చేశాడని ఆరోపించామని అనిల్‌ గుర్తు చేశారు.

"ఆనాడే మీకు చిత్తశుద్ది వుంటే... వాటిపై విచారణ జరిపి నిజాయితీని నిరూపించుకునేవారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అవినీతిపై విచారణ జరిపిస్తామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆనాడే చెప్పారని అనిల్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు. ఇప్పుడు ఈ అవినీతి కుంభకోణాలపై విచారణ జరిపిస్తున్నాం. ఏడాది కాలంలో మాపై ఎవరూ ఏం చేయలేకపోయారంటూ లోకేశ్ సవాల్ చేశారు. ఇప్పుడు అవినీతిపరులపై చర్యలు తీసుకుంటూ వుంటే తట్టుకోలేకపోతున్నారు. 
 
కార్మికుల మందుల్లో రూ.151 కోట్లు దోచేసిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని సమర్థిస్తారా? నకిలీ పత్రాలతో 150 పై చిలుకు బస్సులు నడిపి ఎంతోమంది ప్రాణాలను బలికొన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు అండగా నిలుస్తారా? వీరిద్దరూ చంద్రబాబు, లోకేశ్‌లకు సత్యహరిశ్చంద్రులా కనిపిస్తున్నారా?" అని అనిల్ కుమార్  యాదవ్ ప్రశ్నించారు. 
 
ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని అక్రమాలు, అవినీతి చేసే ఇలాంటి వారికి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నాడని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ రాష్ట్రంలో బిసిలకు, అగ్రవర్ణాలకు వేర్వేరుగా చట్టాలు వున్నాయా? తప్పు చేసింది ఎవరైనా సరే వారికి చట్టం ఒకే విధంగా వుంటుందని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

రూ.151 కోట్ల స్కాం చేసిన వ్యక్తిని స్వాతంత్ర సమరయోధుడు, బిసిలను ఉద్దరించిన వ్యక్తిగా కీర్తిస్తారా? అసలు లోకేశ్‌కు కొంచెమైనా బుద్దీ, జ్ఞానం వుందా అని అనిల్ ప్రశ్నించారు. చంద్రబాబు అండదండలతో కార్మికుల మందుల సొమ్మను పందికొక్కులా తింటే.. వారిని అరెస్ట్ చేస్తే... బిసిలు ఏకం కావాలని లోకేశ్‌ పిలుపునివ్వటం ఏంటని అనిల్ మండిపడ్డారు.

లోకేశ్‌ ఇక నైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. మరోసారి బిసిలకు సిగ్గు వుందా అని మాట్లాడితే.. దానికి తగిన విధంగా జవాబు ఇస్తామని అనిల్ హెచ్చరించారు. లోకేశ్‌ తన వయస్సుకు తగట్టు మాట్లాడటం లేదని.. వైయస్ జగన్ తాతను, తండ్రిని చూశాను అని ప్రగల్భాలు పలుకుతున్నాడు.

రాజారెడ్డి సమయంలో లోకేశ్‌ చెడ్డీలు వేసుకుని తిరుగుతుండేవాడు. సవాల్ విసరడం, ఇంట్లోకి వెళ్లి దాక్కోవడం.. లోకేశ్‌కు అలవాటని అనిల్ ఎద్దేవా చేశారు. సవాల్ విసరడం నా పని... సమాధానం మా నాయన చూసుకుంటాడని లోకేశ్‌ అనుకుంటున్నాడు.  టిడిపి పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా తయారవుతోందని అనిల్ తెలిపారు. కనుచూపు మేరలో అధికారం లేదు. తమ హయాంలో జరిగిన స్కాంలు బయటపడుతున్నాయి.

భవిష్యత్తులో పార్టీ వుంటుందో.. లేదో ననే భయం చంద్రబాబు, లోకేశ్‌లకు పట్టుకుందిని.. ఇప్పటికే పార్టీ నేతలు కొందరు వైయస్‌ఆర్‌సీపీకి, మరికొందరు బిజెపికి, మరికొందరు శ్రీకృష్ణ జన్మస్థానంకు వెళ్ళిపోతున్నారని అనిల్ అన్నారు. 
 
ప్రభుత్వంను అడ్డం పెట్టుకుని అక్రమాలు చేసిన వారిని విచారణ జరిపి అరెస్ట్ చేస్తున్నామని అనిల్ తెలిపారు.  ఇప్పటికే రెండు వికెట్లు పడ్డాయి.... ఇంకా చాలా వికెట్లు వున్నాయి. టిడిపి హయాంలో అక్రమాలకు పాల్పడిన వారు శిక్షలకు సిద్ధంగా ఉండాలని అనిల్ హెచ్చరించారు.

మీరు అక్రమాలకు పాల్పడకుండా వుంటే... మేం న్యాయపోరాటం చేస్తామని ధైర్యంగా ముందుకు రావాలన్నారు. అంతేకాని వడ్డీతో సహా చెల్లిస్తామని సవాల్ చేస్తారా? లోకేశ్‌ చిప్పకూడ గురించి ఎక్కువ మాట్లాడితే తదాస్తు దేవతలు దీవిస్తారు జాగ్రత్త అని అనిల్ అన్నారు. ఇలాగే కలవరిస్తుంటే... చివరికి లోకేశ్‌కు చిప్పకూడు తినే గతి పడుతుందేమో.. అని అనిల్ అన్నారు.

లోకేశ్‌ మాట్లాడుతూ ఈఎస్ఐ స్కాంలో అధికారులదే బాధ్యత అంటారు. రూ.250 కోట్ల టెండర్ ను రూ.900 కోట్లకు అచ్చెన్నాయుడు ఎలా పెంచాడని అనిల్ ప్రశ్నించారు. అవినీతి చేసి ఇప్పుడు అధికారుల మీదికి నెట్టేందుకు ప్రయత్నిస్తారా అని అనిల్ మండిపడ్డారు. 
 
స్టాన్ ఫోర్డ్ లో చదివానంటున్న లోకేశ్‌కు కామన్ సెన్స్ లేదని, మా మంత్రికి సంబంధం లేదు సీఎంగా నేను చెబితేనే ఇలా చేశాడని చంద్రబాబు ఒప్పుకుంటాడా అని అనిల్ ప్రశ్నించారు. ప్రతిదానిని కులాలు, మతాలతో  ముడిపెట్టి, చిచ్చు పెడతారా అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. చంద్రబాబు రాజ్యాంగంలోలా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. తర్వాత జోహార్ ఎన్టీఆర్ అనడం మాకు రాదన్నారు.  ఎపి ఫైబర్ నెట్‌లో జరిగిన అవినీతిపై విచారణకు సిబిఐకి అప్పగించమన్నారు. దీంతో నన్ను కూడా అరెస్ట్ చేస్తారని లోకేశ్‌ భుజాలు తడుముకుంటున్నాడని.. నిజంగా అవినీతి చేస్తే తప్పుకుండా ...  తాను కలవరించే చిప్పకూడు లోకేశ్‌కు తప్పదేమో అని అనిల్ అన్నారు. 
 
ఈ రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్‌లకు సొంత ఇల్లు కూడా లేదన్నారు. అచ్చెన్నాయుడు, జెసి ప్రభాకర్ అరెస్ట్‌లకు పక్కా ఆధారాలు వున్నాయి. అధికారుల విచారణలో వీరి అవినీతిని నిర్ధిష్టంగా బయటపెట్టారన్నారు. దీనిపై మేం విచారణకు సిద్దం... న్యాయపరంగా ఎదుర్కొంటామని ఎందుకు చెప్పడం లేదని అనిల్ ప్రశ్నించారు.

ఈ వ్యవహారాన్ని బిసిల పేరుతో రాజకీయం చేయాలని చూస్తున్నారని టీడీపీపై అనిల్ మండిపడ్డారు. తన పార్టీలోని బిసిలు, ఎస్సీలు చేతకాని వారు అని లోకేశ్‌ అనుకుంటున్నారని అనిల్ అన్నారు.  అలాగే మొత్తం బిసిలు కూడా చేతకాని వారే అనుకుని మాట్లాడితే సహించేది లేదని అనిల్ హెచ్చరించారు. నిజంగా బిసిలపై ప్రేమ వుంటే... నేను చెబితేనే అచ్చెన్నాయుడు చేశాడని చంద్రబాబు చెప్పవచ్చని అన్నారు.

ఈరకంగా అయినా ఒక బిసి నాయకుడిని చంద్రబాబు కాపాడవచ్చని అనిల్ సూచించారు. ఇంకా మేం అధికారంలో వున్నాం, నేనే యువరాజును అని లోకేశ్‌ భావిస్తున్నాడని అనిల్ ఎద్దేవా చేశారు. ఇప్పటికీ చంద్రబాబు ప్రస్టేషన్‌లో వున్నాడు. లోకేశ్‌ ఇలాంటి రెచ్చగొట్టే పనులు, తొడగొట్టడం, సవాళ్ళు విసరడం మానుకోవాలని అనిల్ సూచించారు.

మేం అంతకన్నా ఎక్కువగా సవాళ్ళు చేయగలమని.. అనిల్ అన్నారు.  అయిదేళ్ళ పాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అనిల్ తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్‌, చంద్రన్న కానుక ఇలా అనేక అంశాల్లో అవినీతి జరిగిందని.. ఇవ్వన్నీ బయటకు వస్తుంటే... చంద్రబాబు, లోకేశ్‌లు వణికిపోతున్నారన్నారు. 
 
మీరు చేసిన అవినీతితో బిసిలకు ఏం సంబంధం? డెబ్బై ఏళ్లు దాటిన చంద్రబాబు నాయకత్వంపై ఆ పార్టీలో నమ్మకం పోయిందని.. పార్టీలో లోకేశ్‌ నా వారసుడు అని అని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నాడని అనిల్ ప్రశ్నించారు. అలా చెబితే ఈ మాత్రం పార్టీ కూడా వుండదనే భయం చంద్రబాబుకు వుందని.. అనిల్ తెలిపారు. ఈ రాష్ట్రంలో 151 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించాం. ఒక్క శ్రీ జగన్ గారి బొమ్మ మీదనే మొత్తం పార్టీ అంతా గెలిచింది.

అలా కాకుండా మా వల్లే గెలిచామని అనుకుంటే అది భ్రమే అని 2021 నాటికి పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. లాక్ డౌన్ వల్ల పనులు కొంత నెమ్మదించాయని అనిల్ వివరించారు.