1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (19:48 IST)

మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్పు

బుధవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమావేశపు హాలులో కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అధ్యక్షత వహించారు.

కోవిడ్ కట్టడికి తీసుకోవలసిన చర్యలు, ఆసుపత్రిలో సౌకర్యాల పెంపు వంటి పలు అంశాలపై రెవిన్యూ, పోలీసు, వైద్య, మున్సిపల్ అధికారులతో మంత్రి చర్చించారు.

కోవిడ్ సెకండ్ వేవ్ రోజురోజుకు విస్తరిస్తున్నందున కోవిడ్ బారిన పడేవారి సంఖ్య అధికమవుతున్నందున మచిలీపట్నం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చి, ప్రస్తుతం ఉన్న 150 కోవిడ్ పడకలను 250కి పెంపునకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం రేపటి నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.

ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, సిబ్బంది. వైద్య పరికరాలు తదితర అంశాలపై మంత్రి ఆరా తీశారు. కోవిడ్ పడకలు పెంచుతున్నందున కోవిడ్ విభాగానికి వేరే ప్రవేశద్వారం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎడ్మిట్ అయిన కోవిడ్ రోగులు బయట తిరగకుండా వారికి ట్యాగ్లు వేయాలని సూచించారు.

కోవిడ్ విభాగంలోనికి ఎవరు పడితే వారు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మార్చురి విభాగంలో అవసరమైన మార్చురి బాక్స్లు అదనంగా ఏర్పాటు చేయాలని, అవసరమైతే దాతల సహకారంతో ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు.

స్కానింగ్ కు, ఆపరేషన్సకు అవసరమైన రేడియాలజిస్ట్, మత్తు డాక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల సంఖ్య పెంచుటకు అవసరమైతే డిప్యూటేషన్ పై తీసుకురావాలన్నారు. ఆసుపత్రి ఎదుట గల ఆశీర్వాద భవన్లో ట్రైయేజ్ సెంటర్ ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిలో కోవిడ్ పరీక్షలు నిర్వహించుటకు అవసరమైన మెటీరియల్, సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు.

కోవిడ్ విభాగంలో బాత్రూమ్స్, డోర్స్ మరమ్మత్తులు చేయించాలని మంత్రి ఆదేశించారు. బెల్ కంపెనీ వారు ఆసుపత్రికి ఇచ్చిన వెంటిలేటర్లు చెక్ చేసి వినియోగంలోనికి తేవాలన్నారు. బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ సిద్ధం చేసుకోవాలన్నారు.