1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (23:13 IST)

కర్ణాటక మాండ్య అరకేశ్వరాలయంలో దారుణం, ముగ్గురు అర్చకుల హత్య

కర్ణాటకలోని మాండ్య నగర శివారు ప్రాంతంలో ఘోరం జరిగింది. స్థానికంగా ఎంతో ప్రసిద్ది చెందిన అరకేశ్వరాలయంలో దోపిడీకి వచ్చిన దొంగలు ముగ్గురు అర్చకులను దారుణంగా బండరాయితో మోది చంపారు. మాండ్య నగర సమీపంలో గుట్టలు ప్రాంతంలో అరకేశ్వరస్వామి దేవాలయం వుంది.
 
అయితే ఈ ఉదయం ఆలయంలో ముగ్గురు అర్చకులు రక్తపు మడుగులో విగత జీవులై పడి ఉండటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పైగా ఆలయ హుండీలు పగలగొట్టిన స్థితిలో కనిపించడంతో ఇది దోపిడీ దొంగలు పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. హత్యకు గురైన అర్చకులను గణేశ్, ప్రకాశ్, ఆనంద్‌గా గుర్తించారు. వారి తలలను బండ రాళ్లతో పగలగొట్టి ఉండటం అక్కడి భయాందోళన వాతావరణాన్ని సృష్టించింది.
 
దొంగలు హుండీ లోని కరెన్సీ నోట్లను మాత్రం ఎత్తుకొని మిగతా వాటిని వదిలి వెళ్లారు. కాగా దొంగల దాడిలో మరణించిన ముగ్గురు బంధువులు కావడం విశేషం. ఆలయ భద్రత కోసం ఆ ముగ్గురు అక్కడే నిద్రిస్తుంటారు. నిద్రలో ఉండగా దొంగలు ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. హుండీని దోచుకున్న దొంగలు గర్భగుడి లోపల గాలించినట్లు తెలుస్తున్నది.
 
దీనిపై మాండ్య జిల్లా ఎస్పీ పరశురామ్ మాట్లాడుతూ ఈ ఘటనకు కారకులైన వారికోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ ఘటనపై కర్ణాటక సీఎం బీఎస్ యడ్డ్యూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.