శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (12:13 IST)

భారీగా పెరిగిన వంటనూనె ధరలు

వంటనూనె ధరలు సలసల కాగుతున్నాయి. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఈ మూడు నెలల వ్యవధిలో అన్ని రకాల నూనె ధరలు పెరిగాయి. లీటరు నూనె ప్యాకెట్‌పైరూ.40 వరకు ధర పెరగడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.

పామాయిల్‌ 15 లీటర్ల ధర డిసెంబరులో రూ.1,450, జనవరిలో రూ.1,600 ఉండేది. ఇప్పుడు రూ.1,800కు చేరింది. ఫ్రీడమ్‌, ఆధార్‌, గోల్డ్‌డ్రాప్‌, గోల్డ్‌విన్నర్‌, వంటి రకాలు డిసెంబరులో రూ.1,500, జనవరిలో రూ.2 వేలకు దొరకగా ఇప్పుడు రూ.2,200 చెల్లించాల్సి వస్తోంది.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల.. కరోనా వ్యాప్తితో దిగుమతిపై ఆంక్షలు, వ్యాపారుల కృత్రిమ కొరత వెరసి వంటనూనె ధరలు అమాంతం పెరిగాయి. ధరలు పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వంట నూనెలు అర్జెంటైనా, బ్రెజిల్‌, మలేషియా, ఇండోనేషియా తదితర దేశాల నుంచి షిప్‌ల ద్వారా రాష్ట్రంలోని కాకినాడ, కృష్ణపట్నం, విశాఖ పోర్టులకు చేరుకుంటాయి.

ఇందులో కాటన్‌ సీడ్‌, సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌, తదితర రకాల నుంచి ఆధార్‌, గోల్డ్‌డ్రాప్‌, గోల్డ్‌విన్నర్‌, ఫ్రీడమ్‌, బెస్ట్‌డ్రాప్‌, ఆల్ఫా, ఫ్రెష్‌రీచ్‌, సుప్రీమ్‌, పామాయిల్‌ వంటి రకాలు ఉంటాయి.

వీటిని రిఫైనరీల ద్వారా శుభ్రం చేసి అరలీటరు, లీటరు, ఐదు, 15లీటర్లు చొప్పున కంపెనీలు ప్యాకింగ్‌, డబ్బాల రూపంలో హోల్‌సేల్‌ వ్యాపారులకు అందిస్తాయి.